టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై వెటరన్ స్పిన్నర్ కర్ణ్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. టెస్ట్ ఫార్మాట్లో టీమిండియా అత్యుత్తమ కెప్టెన్ విరాట్ కోహ్లీనే అని కొనియాడాడు. సుదీర్ఘ ఫార్మాట్లో కోహ్లీ సారథ్యంలోనే టీమిండియా దూకుడు కనబర్చిందని, డ్రాల కోసం కాకుండా విజయం కోసం ఆడిందని గుర్తు చేసుకున్నాడు.
విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా ఎన్నో విజయాలు అందుకుంది. అతని కెప్టెన్సీలో 68 టెస్ట్లు ఆడిన టీమిండియా 40 విజయాలు అందుకుంది. కెప్టెన్గా కోహ్లీ దూకుడైన నిర్ణయాలతో జట్టుకు విజయాలు అందించాడు.

2014-15 బోర్డర్ గావస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్కు అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గాయంతో దూరమవ్వడంతో కోహ్లీ జట్టును నడిపించాడు. కెప్టెన్గా తొలి మ్యాచ్ అయినా కోహ్లీ ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నాడని, ఆ మ్యాచ్తోనే టెస్ట్ల్లో అరంగేట్రం చేసిన స్పిన్నర్ కర్ణ్ శర్మ గుర్తు చేసుకున్నాడు.
ఆ మ్యాచ్లో ఓడినా సరే విజయం కోసమే ఆడాలని కోహ్లీ చెప్పాడని, డ్రాలు వద్దని స్పష్టం చేశాడని కర్ణ్ శర్మ చెప్పుకొచ్చాడు.
'ఆసీస్ గడ్డపై నా టెస్ట్ అరంగేట్రం చేయడం నాకు ప్రత్యేకం. చాలా తక్కువ మందికి ఇలాంటి అవకాశం లభిస్తోంది. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంది. ఆ సమయంలో రవిశాస్త్రి కోచ్గా వ్యవహరిస్తున్నారు. ఆ మ్యాచ్ ఛేజింగ్లో మేం 300 ప్లస్ రన్స్ చేశాం. ఈ లక్ష్యాన్ని చేధించబోతున్నామని కెప్టెన్ విరాట్ కోహ్లీ మాతో అన్నాడు. అతని మాటలు ఆటగాళ్లలో సానుకూల దృక్పథాన్ని కలిగించాయి. ఒక్కో కెప్టెన్ ఒక్కో విధానాన్ని అనుసరిస్తారు.
300కి పైగా రన్స్ ఛేజింగ్ చేస్తున్నామని కోహ్లీ చెప్పాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఈ లక్ష్యాన్ని చేధించడం చాలా కష్టం. కానీ.. కోహ్లీ మాటలు డ్రెస్సింగ్ రూమ్లోని ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపాయి'అని కర్ణ్ శర్మ ఆనాటి సంగతులను మరోసారి గుర్తు చేసుకున్నాడు.
అడిలైడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్కు ఆసీస్ 364 లక్ష్యాన్ని నిర్దేశించగా.. 48 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో కోహ్లీ రెండు ఇన్నింగ్స్ల్లో 115, 141 శతకాలతో రాణించాడు.