హైదరాబాద్: క్రికెట్ చరిత్రలోనే అదో అద్భుత ఇన్నింగ్స్.! బహుషా యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నేడు భారత్ శాసిస్తోందంటే అది ఆ ఇన్నింగ్స్ చలవే.! మనదేశంలో క్రికెట్ ఓ ఆటగా కాకుండా మతంలా మారడానికి బీజం పడింది అక్కడే.! ఆ మ్యాచ్కు ప్రత్యక్ష ప్రసారం లేదు..! ఆఖరికి రేడియోలో కామెంట్రీ కూడా రాలేదు.!
అయినా ఆ మ్యాచ్ భారత క్రికెట్లోనే ప్రత్యేకం. ఆ మ్యాచ్ జరిగి నేటికి సరిగ్గా 40 ఏళ్లు అవుతోంది. కానీ అందరి మదిలో ఇప్పటికి కదలాడుతూనే ఉంది. చిత్తుగా ఓడాల్సిన జట్టును ఆ ఇన్నింగ్సే విశ్వవిజేతగా నిలిపింది.!
40 ఏళ్ల కిత్రం ఇదే రోజు( జూన్ 18, 1983) భారత్-జింబాంబ్వే ప్రపంచకప్ మ్యాచ్. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రపంచకప్ రేసులో భారత్ నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్. కానీ భారత టాపార్డర్ దారుణంగా విఫలమైంది. అప్పటి స్టార్ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, శ్రీకాంత్, అమర్నాథ్(5)తో పాటు ఇతర బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
దాంతో 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితిని చూసి టీమిండియా ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఒకే ఒక్కడు విజయం కోసం తీవ్రంగా పోరాడాడు. ఓవైపు వికెట్లు కోల్పోతున్నా.. మరోవైపు చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. ఇతర బ్యాటర్లంతా బంతిని బ్యాట్కు తగిలించడానికే ఇబ్బంది పడ్డ పిచ్లో అలవోక షాట్స్ ఆడుతూ ఆకట్టుకున్నాడు.
అసాధారణ ఇన్నింగ్స్తో టీమిండియాకు సంచలన విజయాన్నందించాడు. అతనెవరో కాదు భారత మాజీ కెప్టెన్, తొలి ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్. ఆ మ్యాచ్లో ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కపిల్ దేవ్ 138 బంతుల్లో 16 ఫోర్లు.. 6 సిక్స్లతో 175 పరుగులతో అజేయంగా నిలిచి క్రికెట్ చరిత్రలోనే మరిచిపోలేని ఇన్నింగ్స్ ఆడాడు.

భారత్ తరఫున తొలి వన్డే సెంచరీ సాధించిన ఆటగాడిగా సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకున్నాడు. స్కేర్వ్ ఆఫ్ ది వికెట్ మీదుగా ఎక్కువ బౌండరీలు బాదిన కపిల్.. సిక్సర్లను మాత్రం లాంగాన్ దిశగా కొట్టాడు. స్ట్రైట్డ్రైవ్ బౌండరీలు కూడా బాదాడు. కపిల్ విధ్వంసంతో భారత్ 8 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది.
అనంతం 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాంబ్వే 113 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అయితే ఆ జట్టు ఆల్రౌండర్ కెవిన్ కుర్రాన్ (73) ఒంటరి పోరాటం చేశాడు. అతనికి మదన్లాల్ అడ్డుకట్ట వేయగా.. రిటర్న్ క్యాచ్తో చివరి వికెట్ను కపిల్ పడగొట్టడంతో జింబాంబ్వే పోరాటం ముగిసింది. భారత్ ఓడాల్సిన మ్యాచ్లో 31 పరుగులతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో మదన్లాల్, రోజర్ బిన్నీ ఇద్దరూ 5 వికెట్లు తీయడంతో పాటు కపిల్ ఒక వికెట్ తీశాడు. అనంతరం ఆస్ట్రేలియాతో చివరి లీగ్ మ్యాచ్ను 118 పరుగులతో గెలిచిన కపిల్సేన సగర్వంగా సెమీస్లోకి అడుగుపెట్టింది. ఇంగ్లండ్పై 6 వికెట్లతో గెలిచి ఫైనల్లో వెస్టిండీస్ను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది.
ప్రపంచకప్ విజయంతో భారత్లో క్రికెట్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అనంతం క్రికెట్ భారత్లో ఓ మతంలా మారిపోయింది. ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ను అభిమానులు నెమరు వేసుకుంటున్నారు.