
న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్పై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. టెస్టుల్లో తన రికార్డును అధిగమించడంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఇటీవల కాలంలో సరిపడ అవకాశాలు రాకున్న అశ్విన్ గొప్ప ఘనత అందుకున్నాడని కొనియాడాడు. శ్రీలంకతో ఇటీవల ముగిసిన ఫస్ట్ టెస్ట్లో అశ్విన్ 6 వికెట్లు పడగొట్టిన అశ్విన్.. టెస్టుల్లో కపిల్ దేవ్ పేరిట ఉన్న 434 వికెట్ల రికార్డును బద్దలు కొట్టాడు.
తద్వారా భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా ఘనత సాధించాడు. మాజీ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (619 వికెట్లు) అశ్విన్ కంటే ముందున్నాడు. కపిల్ దేవ్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఈ నేపథ్యంలో ఓ జాతీయ చానెల్తో మాట్లాడిన కపిల్ దేవ్ అశ్విన్ను ప్రత్యేకంగా అభినందించాడు. 'టెస్ట్ క్రికెట్లో ఇటీవల సరిపడా అవకాశాలు రాకున్నా అశ్విన్ గొప్ప ఘనత అందుకున్నాడు. అవకాశమిచ్చినప్పుడల్లా సత్తా చాటుతూ చాలా త్వరగా నా పేరిట ఉన్న (434 వికెట్లు) రికార్డును బ్రేక్ చేశాడు. అతను సాధించిన ఘనత పట్ల చాలా సంతోషంగా ఉంది.
నా కెరీర్ ముగిసిపోయింది. ఇంకెంత కాలం ఆ రికార్డు నా పేరిట కొనసాగాలి.? అశ్విన్ అద్బుతమైన క్రికెటర్. చాలా తెలివైన స్పిన్నర్. ప్రస్తుతం అతడి లక్ష్యం టెస్టుల్లో 500 వికెట్లు తీయడమే. అతను అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టగలడనే నమ్మకం నాకుంది' అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.
ఇక కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేస్తానని కలలో కూడా ఊహించలేదని అశ్విన్ చెప్పుకొచ్చాడు. '28 ఏళ్ల క్రితం.. కపిల్ దేవ్ 434 వికెట్లతో రికార్డు సృష్టించినప్పుడు నేను చాలా సంతోషించాను. అయితే, నేను ఆఫ్ స్పిన్నర్ అవుతానని గానీ, భారత్ తరఫున ఆడతానని గానీ ఎప్పుడూ అనుకోలేదు. అన్నింటికి మించి కపిల్ దేవ్ రికార్డును అధిగమిస్తాననే ఆలోచన కూడా నాకెప్పుడూ రాలేదు. ఇప్పటి వరకు క్రికెట్ నాకు చాలా ఇచ్చింది. అందుకు నేను కృతజ్ఞుడను' అని అశ్విన్ పేర్కొన్నాడు.