ఆకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్లో ఏదో అసంతృప్తి ఉందని దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. ఘన వీడ్కోలుకు అశ్విన్ అర్హుడని, ఇలా ఆకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఊహించలేదన్నాడు. అశ్విన్కు వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేయకుండా బీసీసీఐ తప్పు చేసిందని అభిప్రాయపడ్డాడు.
ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్ అనంతరం అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్.. అశ్విన్ రిటైర్మెంట్పై స్పందిస్తూ అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు.

'భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒకరైన అశ్విన్ ఇలా ఆకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడం ఆశ్చర్యానికి గురి చేసింది. అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. అయితే అశ్విన్లో ఏదో అసంతృప్తి ఉన్నట్లు అర్థమవుతోంది. అతను సంతోషంగా లేడని, ఏదో బాధలో ఉన్నాడనిపిస్తోంది. ఘన వీడ్కోలుకు అశ్విన్ అర్హుడు. రిటైర్మెంట్ విషయంలో అతను తొందరపడ్డాడు. ఇంకొన్ని రోజులు ఆగి భారత గడ్డపై రిటైర్మెంట్ ప్రకటించాల్సింది. కానీ అశ్విన్ ఇలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు.
ఈ విషయంలో అశ్విన్ వర్షన్ వినాలని ఉంది. దేశం కోసం 106 టెస్ట్లు ఆడిన అశ్విన్కు గౌరవం ఇవ్వాలి. భారత క్రికెట్కు అతను ఎంతో చేశాడు. భారత మ్యాచ్ విన్నర్ అయిన అశ్విన్కు బీసీసీఐ ఘనమైన వీడ్కోలు పలకాలి. క్రికెట్లో ప్రయోగాలకు అశ్విన్ ఎప్పుడూ సిద్దంగా ఉండేవాడు. అతనో క్రికెట్ సైంటిస్ట్. అదే అతని సక్సెస్కు కారణం.
బ్యాటర్లకు ప్రశంసలకు దక్కే క్రికెట్లో అశ్విన్ వారికి ధీటుగా నిలబడ్డాడు. అతని దగ్గర వైవిధ్యమైన బంతులు ఉన్నాయి. ఆఫ్ స్పిన్, క్యారమ్ బాల్తో పాటు లెగ్ స్పిన్ కూడా వేయగలడు. అశ్విన్ ఓ ఛాంపియన్. కెప్టెన్ నమ్మే బౌలర్. నేనాడే సమయంలో అశ్విన్ ఉండి ఉంటే అతనికి జట్టులో చోటు ఇచ్చేందుకు నేను తప్పుకునేవాడిని.'అని కపిల్ దేవ్ కొనియాడాడు.
అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్తో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కారణంగానే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడనే వాదన బలంగా వినిపిస్తోంది. జట్టులో ఎదురైన అవమానాలు తట్టుకోలేకే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించి ఉండొచ్చని అశ్విన్ తండ్రి ఆరోపించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.