బీసీసీఐ తీసుకొచ్చిన 'ఫ్యామిలీ రూల్'ను తప్పుబడుతూ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కుటుంబ సభ్యులతో కాకుండా గదిలో ఒంటరిగా కూర్చోని ఏడవాలా? అంటూ కోహ్లీ కాస్త ఘాటుగానే మాట్లాడాడు. ఈ విషయంలో విరాట్ కోహ్లీకి కొందరు మద్దతుగా నిలిస్తే మరికొందరు అతన్ని తప్పుబట్టారు. బోర్డు నిర్ణయాలను వ్యతిరేకించడం సరికాదని పలువురు మాజీ క్రికెటర్లు కోహ్లీకి హితవు పలికారు.
అయితే ఈ విషయంలో విరాట్ కోహ్లీకి దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ అండగా నిలిచారు. ఆటగాళ్లతో కుటుంబ సభ్యులను అనుమతించాలని అభిప్రాయపడ్డారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ దేవ్ ముందు కోహ్లీ వ్యాఖ్యలను ప్రస్తావించగా.. అతనికి అండగా మాట్లాడాడు. తమ కాలంలో క్రికెట్, కుటుంబానికి సమ ప్రాధాన్యం ఇచ్చేవారిమని గుర్తు చేసుకున్నారు.

'ఆటగాళ్లతో కుటుంబ సభ్యులను అనుమతించవద్దనేది క్రికెట్ బోర్డు నిర్ణయం అనుకుంటున్నాను. అయితే ఆటగాళ్లతో కుటుంబం ఉండటం అవసరమే. అదే సమయంలో జట్టుకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. మా కాలంలో మేం మొదట జట్టుకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవాళ్లం. ఆ తర్వాతే కుటుంబ సభ్యులతో గడిపేవాళ్లం. అలా ఆట, కుటుంబం కలిసిపోయి ఉండేవి.'అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఘోరంగా విఫలమవ్వడంతో బీసీసీఐ కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్లో సమూల మార్పులు చేసేందుకు 10 పాయింట్లతో కూడిన కొత్త గైడ్లైన్స్ను ప్రవేశపెట్టింది. ఈ రూల్స్లో ఆటగాళ్లతో కుటుంబ సభ్యులను అనుమతించడంపై ఆంక్షలు విధించడం కూడా ఉంది. సుదీర్ఘమైన విదేశీ పర్యటనలకు మాత్రమే కుటుంబ సభ్యులను రెండు వారాలే అనుమతించాలని పేర్కొంది. తక్కువ వ్యవధి పర్యటనలకు కుటుంబ సభ్యులు అవసరం లేదని స్పష్టం చేసింది.
ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీ.. ఈ నిబంధనను తప్పుబడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 'మనకు కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులను కలిస్తే ఎంతో ఊరట లభిస్తోంది. ఆ సమయంలో వారి మద్దతు మనందరికి తప్పనిసరిగా కావాలి. దీని గురించి కొంతమందికి వివరించడం కూడా చాలా కష్టం. ఈ విషయం తెలియని వ్యక్తులు కూడా.. క్రికెటర్లను కుటుంబాలకు దూరంగా ఉంచాల్సిన అవసరముందని అంటున్నారు.
అది నన్ను కాస్త నిరాశకు గురి చేస్తోంది. అయినా పర్యటనలో ఉన్నప్పుడు ఆటలో రాణించలేకపోయినా ఆటగాడు ఒంటరిగా కూర్చోవడానికి ఇష్టపడడు. ఆట అనేది ఓ బాధ్యత. దాన్ని పూర్తి చేశాకే వ్యక్తిగత జీవితం గురించి ఆలోచిస్తాం. నేనైతే బయటకు వెళ్లి నా ఫ్యామిలీతో గడిపే సమయాన్ని, అవకాశాలను ఏ మాత్రం వదులుకోను'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.