
లక్నో: బాలీవుడ్ సింగర్ కనికా కపూర్కు కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ పాజిటీవ్ అని తేలినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆమెపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఇక చికిత్స తీసుకుంటున్న ఆమె ఓ స్టార్లా కాకుండా రోగిలా ప్రవర్తించాలని కూడా వైద్యులు సూచించారు.
ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆమెపై సోషల్ మీడియా వేదికగా కూడా తీవ్ర విమర్శలు వ్యక్త మవుతున్నాయి. అయితే ఈ బాలీవుడ్ సింగర్కు కరోనా రావడం సౌతాఫ్రికా క్రికెటర్లను కలవరపెడుతోంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికా జట్టు ఇటీవల ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందే.
ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా తుడిచిపెట్టుకపోగా.. మిగిలిన రెండు వన్డేలు కరోనా దెబ్బతో రద్దయ్యాయి. అయితే రెండో వన్డే కోసం లక్నోకు వచ్చిన సఫారీ జట్టు.. కనికా కపూర్ ఉన్న హోటళ్లోనే స్టే చేసింది. ఇప్పుడు ఇదే ఆ దేశ క్రికెటర్లను కలవరపెడుతోంది. ఇక కరోనా సోకిన తొలి బాలీవుడ్ సెలెబ్రేటీ ఈ బేబీ డాల్ సింగరే కాగా.. ఈమె అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించనట్లు కూడా వార్తలు వినిపించాయి.
'ఆమె హోటల్లోని లాబీలో కొంతమంది అతిథులతో మాట్లాడింది. వన్డే మ్యాచ్ కోసం దక్షిణాఫ్రికా జట్టు హోటల్లో ఉన్న సమయంలో ఆమె కూడా ఉంది. అక్కడ జరిగిన ఓ న్యూస్ ఛానెల్ వార్షిక సమావేశంలో కూడా పాల్గొంది. అయితే సీసీటీవీ ఫుటేజిని పరిశీలించి ఆమెతో సన్నిహితంగా ఉన్న వారి జాబితా తయారుచేస్తున్నాం' అని సంబంధిత అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
ఇక భారత్ నుంచి స్వదేశానికి చేరిన సఫారీ ఆటగాళ్లను ముందస్తు చర్యల్లో భాగంగా 14 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండమని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆ జట్టు డాక్టర్ షుయబ్ మంజ్రా క్రిక్ఇన్ఫోకు తెలిపాడు. 'భారత పర్యటనకు ముందు కరోనా ప్రభావం తక్కువగా ఉంది. కానీ సౌతాఫ్రికా జట్టు అక్కడికి చేరగానే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి.
ఈ వైరస్ గురించి మేం మా ఆటగాళ్లకు అవగాహన కల్పించాం. సౌతాఫ్రికాలో ఇతరులకు ఈ వైరస్ సోకకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరాం. ఇందులో భాగంగానే 14 రోజుల పాటు స్వియ నిర్భంధంలో ఉండమని ఆదేశించాం. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే సమాచారమివ్వమని సూచించాం'అని షుయబ్ మంజ్రా తెలిపారు.