
హామిల్టన్ : భారత్తో తప్పక గెలవాల్సిన మూడో టీ20లో న్యూజిలాండ్ ఓటమిపాలై సిరీస్ను చేజార్చుకున్న విషయం తెలిసిందే. అలవోకగా గెలవాల్సిన ఈ మ్యాచ్లో బ్లాక్ క్యాప్స్ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. అయితే తమ ఓటమికి కారణం ఒత్తిడిని అధిగమించకపోవడమేనని మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో తాము భారత్ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నాడు. సూపర్ ఓవర్ అనేది కూడా తమకు కలిసి రావడం లేదని తెలిపాడు.
'సూపర్ ఓవర్ మాకు కలసి రావడం లేదు. అందుకే మేము సూపర్ ఓవర్కు రాకుండానే గెలవాలి. గత మ్యాచ్ల్లో కన్నా ఇది మా మెరుగైన ప్రదర్శన. ఇండియా అద్భుత ప్రారంభం తర్వాత మా బౌలర్లు అద్భుతంగా కట్టిడి చేశారు. ఇక ఇరుజట్లు స్వల్ప స్కోర్లే నమోదు చేశాయి. ఇంత అద్భుతంగా ఆడిన తర్వాత కూడా ఎదురైన ఈ ఓటమి తీవ్రంగా నిరాశపరిచింది. ఇక క్రికెట్లో ఇది సహజం. మూడు బాల్స్ మ్యాచ్ ఫలితాన్ని శాసించాయి. క్లిష్ట సమయంలో టీమిండియా తన అనుభవాన్ని ఉపయోగించి విజయం సాధించింది. ఈ విషయంలో మేము భారత్ నుంచి ఎంతో నేర్చుకోవాలి. ఈ రోజు నా బ్యాటింగ్ పట్ల సంతృప్తిగా ఉన్నా. మిడిల్ ఓవర్లలో భాగస్వామ్యాలను నమోదు చేశాను. ఇక ఓటమి గురించి సభ్యులతో చర్చించుకోవాలి. మేము మరింత మెరుగుపడాలి. ముఖ్యంగా ఒత్తిడిని జయించడం నేర్చుకోవాలి'అని విలియమ్సన్ చెప్పుకొచ్చాడు.
ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. భారత జట్టులో రోహిత్ శర్మ(65) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(38), కేఎల్ రాహుల్(27)లు ఫరవాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో బెన్నట్ మూడు వికెట్లు పడగొట్టగా... శాంట్నర్, గ్రాండ్హోమ్ చెరో వికెట్ తీసుకున్నారు.
అనంతరం 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 179 పరుగుల చేసింది. భారత బౌలర్లలో ఠాకూర్, షమి రెండేసి వికెట్లు తీసుకోగా.. చాహల్, జడేజా చెరో వికెట్ తీసుకున్నారు. ఇరు జట్ల స్కోర్ సమం కావడంతో మ్యాచ్ విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ ఆడించారు. సూపర్ ఓవర్లో కివీస్ 17 పరుగులు చేయగా.. రోహిత్ మెరుపులతో 20 పరుగులు చేసిన భారత్ విజయాన్నందుకుంది. దీంతో 5 టీ20ల సిరీస్ 3-0తో భారత్ వశమైంది. ఇక ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 శుక్రవారం జరగనుంది.