
వార్నర్ గురించి చర్చిస్తాం...
'సన్రైజర్స్ బృందంలో చాలా మంది నాయకులున్నారు. మేం కలిసి కట్టుగా ఉండడం చాలా ముఖ్యం. అవసరమైన మార్పులు చేస్తూ జట్టును పటిష్ఠంగా నిర్మించడం మాకు అవసరం. విజయం కోసం అతిగా వెతకడం కంటే కూడా మేం ఎలా ఆడుతున్నామనేది ప్రధానం. వార్నర్ ప్రపంచ స్థాయి ఆటగాడు. అతను మా పరిగణలోనే ఉన్నాడు. తనను తిరిగి జట్టులోకి తీసుకునేందుకు చర్చలు సాగుతాయని అనుకుంటున్నా'అని కేన్ విలియమ్సన్ చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్ ఫలితం గురించి మాట్లాడుతూ.. సన్రైజర్స్ హైదరాబాద్కు ఇదో కఠినమైన రోజన్నాడు. అసాధారణ బ్యాటింగ్తో పరుగుల విధ్వంసం సృష్టించిన జోస్ బట్లర్ను ప్రత్యేకంగా అభినందించాడు.

జోస్ బట్లర్ సూపర్..
'ఇదో కష్టతరమైన రోజు. రాజస్థాన్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇది జోస్ బట్లర్ రోజు కూడా. అతడు అత్యద్భుతంగా ఆడాడు. విజయం సాధించాలంటే బ్యాట్తో బాగా ఆడాలి. అయితే, వికెట్లు పడేకొద్దీ 220 లక్ష్యాన్ని చేరుకోవాలంటే కష్టంగా ఉంటుంది. గత మూడు వారాలుగా మా జట్టు అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఇక ఈరోజు మ్యాచ్లో సంజూ, బట్లర్ కీలకంగా ఆడారు. దాంతో వారికి రషీద్ చేత బౌలింగ్ చేయించాలని భావించాం. ఇప్పుడు మేం కొన్ని సర్దుబాట్లు చేసుకొని జట్టును తీర్చిదిద్దుకోవాలి. ఓటములను అంగీకరించి ముందుకు సాగాలి'అని కేన్ చెప్పుకొచ్చాడు.

మళ్లీ ఆడకపోవచ్చు..
వార్నర్ వేటుపై ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన బెయిలీస్.. జట్టు కూర్పులో భాగంగా వార్నర్ ఇక ఆడటం కష్టమని స్పష్టం చేశాడు. ఇది కఠిన నిర్ణయమే అయినా జట్టు ప్రయోజనాల కోసం తప్ప లేదన్నాడు. విదేశీ ఆటగాళ్లు నలుగురే ఉండే నిబంధనతో తాము బౌలింగ్ ఆప్షన్లను కూడా దృష్టిలో పెట్టుకునే రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్కు వార్నర్ పక్కనపెట్టామన్నాడు. తాము ఆడబోయే మిగతా మ్యాచ్ల్లో కూడా ఇదే వ్యూహం కొనసాగవచ్చన్నాడు. ఈ నిర్ణయంతో అతను చాలా బాధపడ్డాడని తెలిపాడు.

చెలరేగిన జోస్, సంజూ..
ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 220 పరుగులు చేసింది. జోస్ బట్లర్(64 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 124) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. సంజూ శాంసన్(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 48) భాద్యతాయుత ఇన్నింగ్స్తో రాణించాడు. సన్రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ, రషీద్ ఖాన్, విజయ్ శంకర్ తలో వికెట్ తీశారు. అనంతరం హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. జానీ బెయిర్ స్టో(31), మనీష్ పాండే(30)తో సహా అంతా విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్, క్రిస్ మోరీస్ మూడేసి వికెట్లు తీయగా.. కార్తీక్ త్యాగీ, రాహుల్ తెవాటియా చెరొక వికెట్ తీశారు.


Click it and Unblock the Notifications
