
క్రైస్ట్చర్చి: భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ చూడటం కన్నా తనకు తన బిడ్డ డైపర్లు మార్చడమే ముఖ్యమని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పష్టం చేశాడు. పాకిస్థాన్తో స్వదేశంలో జరిగిన రెండు టెస్ట్ల సిరీస్ 2-0తో క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని అందుకుంది. ఇక బుధవారం ముగిసిన రెండో టెస్ట్లో న్యూజిలాండ్ 176 పరుగులతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో కేన్ డబుల్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కేన్ మామను.. భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్లు చూస్తారా? అని ప్రశ్నించగా తనదైనశైలిలో బదులిచ్చాడు.
'నా కూతురికి పాలు పట్టిస్తూ.. డైపర్లు మార్చుతూ మధ్య మధ్యలో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ చూశాను. క్రికెట్ను చూడటం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. కానీ మొత్తం చూడలేం. ఆ మ్యాచ్ల కన్నా నాకు నా పాప డైపర్లు మార్చడమే ముఖ్యం'అని తెలిపాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
ఇక రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 297 పరుగులకు ఆలౌటవ్వగా.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ను 158.5 ఓవర్లలో 6 వికెట్లకు 659 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దాంతో ఫస్ట్ ఇన్నింగ్స్లో 362 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకుంది. తొమ్మిది గంటల పాటు మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన కెరీర్లో నాలుగో డబుల్ సెంచరీ ( 28 ఫోర్లతో 238) సాధించాడు. అంతేకాకుండా టెస్టుల్లో 7 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇక హెన్రీ నికోల్స్ (18 ఫోర్లు, సిక్స్తో 157), డారిల్ మిచెల్ (8 ఫోర్లు, 2 సిక్స్లతో 102 నాటౌట్ ) కూడా శతకాలు బాదడంతో కివీస్ భారీ స్కోరును అందుకుంది.
విలియమ్సన్, నికోల్స్ నాలుగో వికెట్కు 369 పరుగులు జోడించారు. 362 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్థాన్ కివీస్ బౌలర్ కైల్ జేమిసన్ దాటికి 186 పరుగులకే చేతులెత్తేసి ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. అజార్ అలీ(37), జాఫర్ గౌహర్(37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక ఈ మ్యాచ్లో జెమీసన్ మొత్తంగా 10 వికెట్లు తీసి సత్తా చాటాడు.