
ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ హిట్టర్స్ డేవిడ్ వార్నర్, రోవ్మన్ పొవెల్ విధ్వసంకర బ్యాటింగ్తో తమ ఓటమిని శాసించారని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్లో దారుణంగా విఫలమైన హైదరాబాద్ 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇది హైదరాబాద్కు వరుసగా మూడో ఓటమి. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన కేన్ మామ.. బంతితో పాటు బ్యాట్తో కొంత మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉందన్నాడు. వరుసగా వికెట్లను కోల్పోవడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు.
'ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన లక్ష్యాన్ని మా ముందుంచింది. అయితే మా బ్యాటింగ్ యూనిట్ ఆడుతూ పాడుతూ ఈ లక్ష్యాన్ని చేధించగలదని అనుకున్నా. కానీ అది జరగలేదు. డేవిడ్ వార్నర్, రోవ్మన్ పొవెల్ అద్భుతంగా ఆడారు. ఈ మ్యాచ్ పరాజయం నుంచి ఎంతో గుణపాఠం నేర్చుకోవచ్చు. దారళంగా పరుగులిచ్చిన ఉమ్రాన్ మాలిక్కు కూడా ఇది మంచి అనుభవం. అత్యుత్తమ జట్టు పైనే మన అసలు సిసలు సత్తా ఏంటో తెలుస్తోంది. మ్యాచ్లో పరిస్థితులు వెను వెంటనే మారుతాయి.
ఢిల్లీ బ్యాటింగ్లో మంచి రిథమ్ ఉంది. మా జట్టులోని పూరన్, మార్క్రమ్ సైతం అద్భుతంగా ఆడారు. జట్టులోని తమ తమ పాత్రలను పోషించారు. వ్యక్తిగతంగా రాణిస్తూ జట్టుకు మేలు చేయాలనుకుంటున్నా. ఓపికగా బ్యాటింగ్ చేయడంపై దృష్టిసారించా. లీగ్లో ప్రతీ జట్టు బలంగానే ఉంది. అద్భుతంగా రాణిస్తూ టోర్నీలో ముందుకు కొనసాగడం ముఖ్యం'అని కేన్ మామ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 207 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లతో 92 నాటౌట్), రోవ్మన్ పోవెల్(35 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్లతో 67 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్లతో చెలరేగారు. సన్రైజర్స్ బౌలర్లలో భువీ, సీన్ అబాట్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 186 పరుగులు మాత్రమే చేసింది. నికోలస్ పూరన్(34 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లతో 62), ఎయిడెన్ మార్క్రమ్(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 42) రాణించినా ఫలితం లేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ మూడు వికెట్లతో రాణించగా.. శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అన్రిచ్ నోర్జ్, మిచెల్ మార్ష్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.