నేరుగా కోహ్లీ వద్దకు వచ్చి
న్యూజిలాండ్ సీనియర్ బ్యాట్స్మన్ రాస్ టేలర్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ బాధ్యతగా ఆడి జట్టును గెలుపుతీరాలకు చేర్చిన విషయం తెలిసిందే. టేలర్ విన్నింగ్ షాట్ కొట్టగానే కివీస్ డ్రస్సింగ్ రూమ్లో అసలైన సందడి మొదలైంది. ఆటగాళ్లు ఒకర్నొకరు హత్తుకొంటూ.. గెంతులు వేస్తూ.. పెద్దగా కేకలు వేస్తూ తమ ఆనందం పంచుకున్నారు. ఇక గెలుపు షాట్ కొట్టిన టేలర్ను అభినందించిన విలియమ్సన్ నేరుగా విరాట్ కోహ్లీ వద్దకు వచ్చి కౌగిలించుకున్నాడు. తామిద్దరం సహచరులం కావడంతోనే అలా చేశానని కేన్ అంటున్నాడు.
మేమిద్దరం సహచరులం
'విరాట్ కోహ్లీ, నేను చాలాకాలంగా ఒకరికొకరం తెలుసు. అంతేకాకుండా మేమిద్దరం సహచరులం. క్రీడల వల్ల ప్రపంచ వ్యాప్తంగా చాలామందిని కలిసే అవకాశం దొరుకుతుంది. అంతేకాకుండా భిన్నమైన స్నేహ బంధాలు లభిస్తాయి. కలిసి ఆడుతున్నా.. ఎదురెదురుగా తలపడుతున్నా భిన్నమైన అనుభవాలు ఎదురవుతాయి. కొన్నిసార్లు ఇద్దరి ఆసక్తులు, ఇష్టాయిష్టాలు ఒకేలా ఉంటాయి' అని కేన్ విలియమ్సన్ అన్నాడు. ఒక మ్యాచులో ఓడిపోయినంత మాత్రాన కోహ్లీసేనను తక్కువ అంచనా వేయొద్దని.. అది బలమైన జట్టని పేర్కొన్నాడు.
త్వరలోనే ఐపీఎల్ 2021 రెండోదశ షెడ్యూల్.. కొత్త జట్ల కోసం టెండర్లు! యూఏఈలోనే టీ20 ప్రపంచకప్!
కేన్ ఖాతాలో ఐసీసీ ట్రోఫీ
కోహ్లీ-కేన్ కొన్నేళ్లుగా తమతమ జట్లకు సారథ్యం వహిస్తున్నారు. అంచలంచెలుగా ఎదుగుతూ ప్రపంచ క్రికెట్లో బలమైన ముద్ర వేశారు. కీలక ఆటగాళ్లుగా ఎదిగారు. కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీల్లో సత్తా చాటేందుకే ప్రయత్నిస్తున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ సారథులే అయినా.. ఐసీసీ టోర్నీల్లో ఫైనల్ మెట్లపై బోల్తా పడటం వారికీ ఇబ్బందిగా మారింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీసేన ఫైనల్లో పాక్ చేతిలో ఓడింది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్లో కివీస్ చేతిలో ఓటమి చవిచూసింది. కానీ డబ్ల్యూటీసీ రూపంలో కేన్ ఖాతాలో ఓ ఐసీసీ ట్రోఫీ చేరింది.
గదతో పాటు రూ.11.67 కోట్ల ప్రైజ్మనీ
సౌథాంప్టన్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో వరణుడు కీలక పాత్ర పోషించాడు. రెండు రోజులు ఒక్క బంతి కూడా పడలేదు. మరో రెండు రోజులు పూర్తి ఆట సాధ్యపడలేదు. దాంతో రిజర్వు డే అయిన బుధవారం ఫలితం తేలుతుందో లేదోనని భావించారు. అయితే భారత్ త్వరగా ఆలౌట్ కావడంతో స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ సునాయాసంగా అందుకుంది.
కోహ్లీసేన తొలి ఇన్నింగ్స్లో 217 పరుగులకు ఆలౌట్ కాగా.. కివీస్ 249 పరుగులు చేసింది. 32 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 170 పరుగులకే ఆలౌట్ అయింది. 140 పరుగులు లక్ష్యాన్ని కివీస్ 2 వికెట్లు నష్టపోయి ఛేదించింది. ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన కివీస్కి ఛాంపియన్షిప్ గదతో పాటు రూ.11.67 కోట్ల ప్రైజ్మనీ దక్కింది. రన్నరప్గా నిలిచిన భారత్ జట్టుకి రూ.5.84 కోట్ల ప్రైజ్మనీ లభించింది.