హైదరాబాద్: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు ఏ మాత్రం కలిసిరావడం లేదు. గాయాల బెడద అతనికి కంటి మీద కునుకు లేకండా చేస్తోంది. ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన తొలి మ్యాచ్లోనే ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన కేన్ మామ.. దాదాపు ఏడు నెలలు బెడ్కే పరిమితమయ్యాడు.
పూర్తిగా కోలుకొని ప్రపంచకప్ బరిలోకి దిగినా.. ఫిట్నెస్ సమస్యలతో తొలి రెండు మ్యాచ్లు ఆడలేదు. బంగ్లాదేశ్తో శుక్రవారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్తో రీఎంట్రీ ఇచ్చిన కేన్ మామ.. సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. హాఫ్ సెంచరీతో ఈ మెగా టోర్నీని ప్రారంభించాడు. కానీ అతన్ని దురదృష్టం వెంటాడింది. సెంచరీ దిశగా సాగుతున్న కేన్ విలియమ్సన్కు మళ్లీ గాయమైంది.

పరుగు తీస్తున్న సమయంలో ఫీల్డర్ విసిరిన త్రో నేరుగా అతని ఎడమ చేతి బొటన వేలికి బలంగా తాకింది. ఈ అనూహ్య గాయంతో విలవిలలాడిన కేన్ మామ ఫిజియోల సూచనలతో మైదానం వీడాడు. వెంటనే స్కానింగ్ల కోసం అతన్ని ఆసుపత్రికి తరలించగా.. వేలికి ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. దాంతో అతను మళ్లీ జట్టుకు దూరమయ్యాడు.
మరో మూడు మ్యాచ్ల వరకు ఆడలేని పరిస్థితి నెలకొంది. ఆ తర్వాతనైనా అందుబాటులోకి వస్తాడా? అంటే గ్యారంటీ లేదు. గాశారం బాలేకనే కేన్ మామ ఇలా వరుసగా గాయపడుతున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఫీల్డర్ విసిరిన బంతికి గాయపడటం ఏంటో అర్థం కావడం లేదని అభిప్రాయపడుతున్నారు. 'అదృష్టం తలుపు తట్టే లోపే.. న్యూజిలాండ్ టీమ్కు దరిద్రం లిప్ లాక్ పెట్టింది'అని సెటైర్లు పేల్చుతున్నారు.
వన్డే ప్రపంచకప్ 2023లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న న్యూజిలాండ్కు కేన్ విలియమ్సన్ గాయంతో దూరమవ్వడం ఎదురు దెబ్బే. భారత్లో ఆడిన అనుభవం ఎంతో ఉన్న కేన్ విలియమ్సన్ ఆ జట్టు మిడిలార్డర్లో కీలక కానున్నాడు. ఇంగ్లండ్పై ఆ జట్టు విజయం సాధించినా.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్ వంటి పటిష్టమైన జట్లను ఓడించాలంటే కేన్ లాంటి ఎక్స్పిరియన్స్ బ్యాటర్, కెప్టెన్ జట్టుకు ఎంతో అవసరం.
న్యూజిలాండ్ తమ తదుపరి మూడు మ్యాచ్ల్లో అఫ్గానిస్థాన్, భారత్, ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మూడు మ్యాచ్లకు కేన్ మామ దూరం కానున్నాడు.