Kane Williamson, IND vs NZ 1st semi-final: టీమిండియా అసాధారణ ప్రదర్శనతో తమ పతనాన్ని శాసించిందని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో టీమిండియా ఫైనల్ చేరగా.. న్యూజిలాండ్ మరోసారి టైటిల్ లేకుండానే ఇంటిదారిపట్టింది.

ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన కేన్ మామ.. తమ కంటే టీమిండియా మెరుగైన ప్రదర్శన చేసిందన్నాడు. ఈ విజయానికి టీమిండియా ఆటగాళ్లు పూర్తి అర్హులని అభినందించాడు. ఈ మ్యాచ్లో ఓడినా.. తమ జట్టు పోరాటం ఆకట్టుకుందని తెలిపాడు.
'ఫైనల్ చేరిన టీమిండియాకు అభినందనలు. ఈ టోర్నీలో ఆ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. ఈ రోజు భారత ఆటగాళ్లు తమ అత్యుత్తమ ఆటను బయటకు తీసారు. టీమిండియా టాప్ టీమ్. అసాధారణ క్రికెట్ ఆడుతోంది. ఈ విజయానికి వాళ్లు పూర్తిగా అర్హులు. మా ఆటగాళ్లు కనబర్చిన పోరాటం పట్ల గర్వపడుతున్నాను.
నాకౌట్లో ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది. భారత్ టాప్ క్లాస్ ప్లేయర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. 400 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందు ఉంచారు. బంతి మూవ్ అయినప్పుడు ఆడటం చాలా కష్టమైంది. ఈ మ్యాచ్కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. కానీ మొత్తం భారత్కే మద్దతు తెలిపారు. భారత్ ఆతిథ్యమిచ్చే టోర్నీలో పాల్గొనడం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది.
ఈ టోర్నీలో మా జట్టు కమిట్మెంట్తో ఆడింది. రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ అసాధారణ ప్రదర్శన కనబర్చారు. బౌలర్లు కూడా అద్భుతంగా పోరాడారు. ఇక జట్టుగా తదుపరి సిరీస్లకు సిద్దమవుతాం'అని కేన్ మామ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 117), శ్రేయస్ అయ్యర్(70 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్లతో 105) శతకాలతో రాణించారు. శుభ్మన్ గిల్(66 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 80 నాటౌట్), రోహిత్ శర్మ(29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 47) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ మూడు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 48.5 ఓవర్లలో 327 పరుగులకే కుప్పకూలింది. డారిల్ మిచెల్(119 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్లతో 134) సెంచరీ సాధించగా.. కేన్ విలియమ్సన్(73 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 69) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ ఏడు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.