
న్యూఢిల్లీ: ఆసియాకప్ 2023 కోసం టీమిండియా పాకిస్థాన్కు రాకుంటే.. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బహిష్కరించాలని ఆ జట్టు మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ అన్నాడు. పాకిస్థాన్ ఆటగాళ్లకు భారత్లో చాలా మంది అభిమానులుంటారని చెప్పిన అక్మల్.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ల నిర్వహణపై రెండు ప్రభుత్వాల నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నాడు.
ఏసీసీ షెడ్యూల్ ప్రకారం ఆసియాకప్ 2023 పాకిస్థాన్ అతిథ్య దేశం కాగా.. బీసీసీఐ మాత్రం అక్కడికి టీమిండియాను పంపేదిలేదని స్పష్టం చేసింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్లో ఇప్పటికే చర్చలు జరగ్గా.. మార్చిలో మరోసారి భేటీ అయి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, భారత్ ఆడే మ్యాచ్లను యూఏఈ వేదికగా నిర్వహించేందుకు పాక్ క్రికెట్ బోర్డు సిద్ధంగా ఉందనే వార్తలు వచ్చాయి. పాకిస్థానే టోర్నీని నిర్వహిస్తూ.. టీమిండియా మ్యాచ్లను మాత్రం యూఏఈ వేదికగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడానికి పీసీబీ ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఇదే అంశంపై మాట్లాడిన కమ్రాన్ అక్మల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ కోసం టీమిండియా పాక్కు రాకపోతే.. వన్డే ప్రపంచకప్ కోసం భారత్కు వెళ్లకూడదని పీసీబీకి సూచించాడు. 'పాకిస్థాన్లో జరిగే ఆసియా కప్ను ఆడేందుకు భారత్ అంగీకరించకపోతే.. 2023 వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ జట్టు అక్కడికి వెళ్లకుండా బహిష్కరించాలి. అయితే, ఈ నిర్ణయాలు మన చేతుల్లో ఉండవు.
ఐసీసీ మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే పీసీబీ అయినా దానిపై ఫోకస్ పెట్టాలి. మేం ప్రపంచ ఛాంపియన్లం, టీ20 ప్రపంచకప్తోపాటు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. ఐసీసీ ర్యాంకింగ్స్లో అన్ని ఫార్మాట్లలోనూ అగ్ర స్థానంలో కూడా నిలిచాం. అయితే, ఐసీసీ, పీసీబీ, బీసీసీఐ చేతుల్లో ఏమీ లేదు. రెండు ప్రభుత్వాల స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఇరు జట్లూ పర్యటించవు. మరి ఇదెంత కాలం కొనసాగుతోంది చూడాలి'అని కమ్రాన్ అక్మల్ చెప్పుకొచ్చాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గురించి కూడా అక్మల్ ఓ ఆసక్తికర ఘటనను గుర్తు చేసుకున్నాడు. 2005 భారత పర్యటనలో షోయబ్ మాలిక్.. సౌరవ్ గంగూలీని రెచ్చగొట్టి ఔటయ్యేలా చేశాడన్నాడు. బ్యాటింగ్లో తడబడుతున్న దాదాను సూటిపోటీ మాటలతో రెచ్చగొట్టాడని, దాంతో దాదా.. భారీ షాట్ ఆడే క్రమంలో ఔటయ్యాడని తెలిపాడు.