టీ20 ప్రపంచకప్ 2024లో తొలి మ్యాచ్లో పాకిస్థాన్కు అనూహ్య పరాజయం ఎదురైంది. అమెరికా సంచలన విజయం సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సూపర్ ఓవర్కు దారి తీసిన ఈ మ్యాచ్లో పాకిస్థాన్ ఓడిపోవడంపై ఆ జట్టు మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
పాకిస్థాన్ క్రికెట్కు ఇంతకు మించిన అవమానం లేదని చెప్పాడు. అమెరికాకు చెందిన సెమీ ప్రోఫెషనల్ క్రికెటర్స్, పాకిస్థాన్ ఆటగాళ్ల కంటే మెరుగ్గా రాణించారని తెలిపాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా పాకిస్థాన్ పరాజయంపై స్పందించిన కమ్రాన్ అక్మల్.. తమ జట్టు ఆటతీరుపై విమర్శలు గుప్పించాడు.

'సూపర్ ఓవర్లో మ్యాచ్ ఓడిపోవడం పాకిస్థాన్ క్రికెట్కు ఘోర అవమానం. మా దేశానికి ఇంతకు మించిన అవమానం లేదు. అమెరికా అసాధారణ ప్రదర్శన కనబర్చింది. ఏ దశలోనూ ఆ జట్టు పసికూన అని ఫీలవ్వలేదు. పాకిస్థాన్ కంటే మెరుగైన జట్టుగానే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. అలాంటి పరిణితిని యూఎస్ఏ ఆటగాళ్లు ప్రదర్శించారు.
వాళ్లు ఈ విజయానికి పూర్తి అర్హులు. ఎందుకంటే పాకిస్థాన్ కంటే మెరుగైన ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్తో క్రికెట్ ముఖచిత్రం ఎలా ఉందో అర్థమైంది.'అని కమ్రాన్ అక్మల్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 159 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ అజామ్ ( 43 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 44), షాదాబ్ ఖాన్ ( 25 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లతో 40) రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

అమెరికా బౌలర్లలో కెంజిగె (3/30), సౌరభ్ నేత్రావల్కర్ (2/18) నిప్పులు చెరిగారు. అనంతరం అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి సరిగ్గా 159 పరుగులే చేసింది. దాంతో ఇరు జట్లు స్కోర్లు టై అయ్యాయి.
యూఎస్ఏ కెప్టెన్ మొనాన్క్ పటేల్ (38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్తో 50), ఆరోన్ జోన్స్ (26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 నాటౌట్), ఆంద్రీస్ గౌస్ (26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ 35) సత్తా చాటారు. మహమ్మద్ అమీర్, నసీమ్ షా, హారిస్ రౌఫ్ తలో వికెట్ తీసారు.