
షార్జా: ఐపీఎల్ 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ కగిసో రబడా రఫ్ఫాడిస్తున్నాడు. ప్రతీ మ్యాచ్లో వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతని అద్భుత బౌలింగ్తో లీగ్లో ఢిల్లీ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే ఆరు మ్యాచ్లు ఆడిన ఢిల్లీ 5 విజయాలతో టేబుల్ టాపర్గా కొనసాగుతుంది. రాజస్థాన్ రాయల్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో 46 పరుగుల తేడాతో విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్లో రబడా మూడు వికెట్లు తీసి రాజస్థాన్ పతనాన్ని శాసించాడు. ఇప్పటికే 15 వికెట్లతో పర్పుల్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు.
ఈ క్రమంలోనే టోర్నీ చరిత్రలో రబడా ఓ అరుదైన రికార్డు అందుకున్నాడు. 2017 నుంచీ ఇప్పటివరకు వరుసగా 20 మ్యాచ్ల్లో కనీసం ఒక్క వికెటైనా తీసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇదివరకు ఈ రికార్డు వినయ్కుమార్ పేరిట ఉండగా.. తాజా మ్యాచ్తో రబడా అధిగమించాడు. వినయ్ కుమార్ 2012-2013 సీజన్లలో వరుసగా 19 ఇన్నింగ్స్ల్లో వికెట్లు పడగొట్టాడు.
చెన్నై ఆల్రౌండర్ డ్వేన్బ్రావో 2012 నుంచీ 2015 వరకు వరుసగా 27 మ్యాచ్ల్లో వికెట్లు తీసి ఈ జాబితాలో టాప్లో ఉన్నాడు. ఇక ముంబై పేసర్ లసిత్ మలింగ 2015-2017 సీజన్ల మధ్య 17 మ్యాచ్ల్లో వికెట్లు పడగొట్టాడు. దాంతో అతడు నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలోనే రబడా ఈ సీజన్లో మరో ఎనిమిది మ్యాచ్ల్లో వరుసగా వికెట్లు పడగొడితే బ్రావో రికార్డును సైతం అధిగమించే అవకాశం ఉంది. దాంతో ఈ టోర్నీ చరిత్రలోనే సౌతాఫ్రికా పేసర్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పుతాడు. ఇక ఈ సీజన్లో రబడా తర్వాత ముంబై పేసర్ బుమ్రా 11 వికెట్లతో పర్పుల్ క్యాప్ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.