
హైదరాబాద్: అఫ్గానిస్థాన్లోని కాబుల్లో జరిగిన ఆత్మాహుతి దాడి పట్ల ఆ జట్టు స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ట్విటర్ వేదికగా ఈ ఘటనపై స్పందించిన రషీద్ ఖాన్ చదువును చంపేయకండిని విజ్ఞప్తి చేస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లో గత శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో అభం శుభం తెలియని 100 మంది విద్యార్థులు చనిపోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు.
విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఒక ఆగంతకుడు బాంబు ధరించి క్లాస్రూంకు వెళ్లాడు. విద్యార్థులు మధ్య కూర్చున్న తర్వాత తనను తాను పేల్చుకున్నట్లు అధికారులు మీడియాకు తెలిపారు. ఆత్మాహుతి దాడిలో 46 మంది బాలికలతో పాటు ఒక మహిళ మరణించినట్లు ఐక్యరాజ్యసమితి ధృవీకరించింది. ఆ తర్వాత మరణించిన వారి సంఖ్య 100కు చేరుకోగా.. 110 మంది గాయపడినట్లు ఐరాస తన ట్విటర్లో ప్రకటించింది.
ఈ ఘటన వార్త విని చలించి పోయిన రషీద్ ఖాన్.. 'దయచేసి చదువును చంపేయకండి.. అభం శుభం తెలియని చిన్నారులు. వారిని ఎందుకు పొట్టబెట్టుకున్నారు.. ఇది చాలా బాధాకరం'అంటూ ట్వీట్ చేశాడు. ఇక కాబుల్లోని ఆసుపత్రిలో ఐసీయూ వెలుపల తన సోదరి స్కూల్ బ్యాగ్తో బాధతో కూర్చున్న టీనేజర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ''ది మోస్ట్ హార్ట్బ్రేకింగ్ ఫోటో'' అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
అఫ్గానిస్తాన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చి ఆగస్టుతో ఏడాది పూర్తయింది. ఆ తర్వాత నుంచి వరుసుగా బాంబు దాడులు జరుగుతున్నాయి. తాలిబన్ల పాలనకు వ్యతిరేకంగానే ఉగ్రసంస్థలు ఈ దారుణాలకు పాల్పడుతున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.