
హైదరాబాద్: టీమిండియాను వారి సొంతగడ్డపై ఓడించినప్పుడే ఆస్ట్రేలియా జట్టు అత్యుత్తమ జట్టు అని ఆసీస్ కొత్త కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు. బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా ఆ జట్టు హెడ్ కోచ్ డారెన్ లీమన్ కోచ్ పదవి నుంచి తప్పుకోవడంతో కొత్త కోచ్గా జస్టిన్ లాంగర్ గురువారం బాధ్యతలు స్వీకరించాడు.
ఈ సందర్భంగా జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ 'ప్రస్తుతం నా ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. భారత ఉపఖండ పర్యటనే ప్రధాన సవాల్ కానుంది. రానున్న రోజుల్లో మేం వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్లతోపాటు రెండు యాషెస్ సిరీస్లు ఆడాల్సింది. తలుచుకుంటేనే కాస్త జంకుగా ఉంది' అని లాంగర్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
'2021లో ఆస్ట్రేలియా... భారత్లో పర్యటించనుంది. దీనికి మూడు నాలుగేళ్ల సమయం ఉంది. భారత్ను వారి సొంత గడ్డ మీద ఓడిస్తే.. మమ్మల్ని మేం అత్యుత్తమ జట్టుగా పరిగణిస్తాం. గిల్క్రిస్ట్ నాయకత్వంలోని ఆసీస్ జట్టు భారత్ను వారి సొంత గడ్డ మీదే 2-1 తేడాతో ఓడించింది. 2004 నాటి ఆ విజయమే నా కెరీర్లో మౌంట్ ఎవరెస్ట్ లాంటిది' అని అన్నాడు.
ఇండియాలో టెస్టు సిరీస్ నెగ్గితే ఆస్ట్రేలియా ఖ్యాతి తిరిగి ఇనుమడిస్తుందని జస్టిన్ లాంగర్ ఈ సందర్భంగా చెప్పాడు. నాలుగేళ్ల పాటు పురుషుల ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్గా బాధ్యతలు అందించేందుకు జస్టిన్ లాంగర్ను క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం నియమించింది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటన చేసింది.
'నాలుగేళ్ల పాటు పురుషుల ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్గా బాధ్యతలు అందించేందుకు జస్టిన్ లాంగర్ను నియమించాం. మే 22న ఆయన బాధ్యతలు చేపడతారు. ఆయన హయాంలో ఆసీస్ రెండు యాషెస్ సిరీస్లతో పాటు వన్డే, టీ20 ప్రపంచకప్లు ఆడనుంది' అని సీఏ ఓ ప్రకటనలో పేర్కొంది.
1993 నుంచి 2007 వరకు ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన లాంగర్ 105 టెస్టులాడాడు. 45.27 సగటున 7,696 పరుగులు సాధించాడు. ఇందులో 23 సెంచరీలు ఉన్నాయి.