అంచానల్లేకుండా..
కపిల్ దేవ్ నేతృత్వంలోని 14 మంది సభ్యులతో కూడిన భారత జట్టు 1983 ప్రపంచకప్ కోసం ఇంగ్లండ్లో అడుగుపెట్టింది. అప్పుడు భారత్ టైటిల్ గెలవడం దేవుడెరుగు.. కనీసం లీగ్ దశ దాటితే చాలాని అంతా భావించారు. జట్టులో సునీల్ గావస్కర్, దిలీప్ వెంగ్సర్కార్, కృష్ణమాచారి శ్రీకాంత్, మదన్లాల్, రవిశాస్త్రి, సందీప్పాటిల్, రోజర్ బిన్నీ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. అయినా ఈ దిగ్గజాలపై ఎవరికీ అంచనాల్లేవు. మొత్తం ఎనిమిది జట్లు.. ఆ ప్రపంచకప్లో పాల్గొనగా రెండు గ్రూపులుగా నాలుగేసి జట్లను విభజించారు. భారత్ ఉన్న విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్తో పాటు మరో పెద్ద జట్టు ఆస్ట్రేలియా, జింబాబ్వే ఉన్నాయి.

కపిల్ 175 నాటౌట్..
వెస్టిండీస్పై 34 పరుగులతో గెలుపొంది ప్రపంచకప్లో బోణీ కొట్టిన భారత్.. అనంతరం రెండో మ్యాచ్లో జింబాబ్వేను 155 పరుగులకే కట్టడి చేసి రెండో విజయం సొంతం చేసుకుంది. తర్వాత ఆసీస్, వెస్టిండీస్లతో వరుసగా ఓటమిపాలవడం వల్ల కపిల్సేనకు చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిగిలిన రెండు మ్యాచుల్లో భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్ బెర్తు. అలాంటి పరిస్థితుల్లో కపిల్ దేవ్(175 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్తో జింబాబ్వేపై చిరస్మరణీయ విజయాన్నందించాడు. కానీ దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్ టీవీల్లో ప్రసారం కాలేదు. ఆ రోజు బీబీసీ ఉద్యోగులు సమ్మె చేయడం వల్ల యావత్ క్రీడాలోకం కపిల్దేవ్ చారిత్రక ఇన్నింగ్స్ను చూడలేకపోయింది.

43 పరుగుల తేడాతో..
తర్వాతి మ్యాచ్లో ఆసీస్ను మట్టికరిపించిన కపిల్సేన.. తొలిసారి ప్రపంచకప్లో సెమీస్కు చేరింది. అక్కడ పటిష్ఠమైనత ఇంగ్లాండ్ను ఓడించి సరాసరి ఫైనల్కు దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ను 43 పరుగులతో ఓడించి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మెగా ఫైనల్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కపిల్ సేన 183 పరుగులకే కుప్పకూలింది. గార్డన్ గ్రీనిడ్జ్, డెస్మండ్ హెయిన్స్, వివ్ రిచర్డ్స్, క్లైవ్ లాయిడ్ లాంటి ప్రపంచశ్రేణి బ్యాట్స్మన్ కలిగిన వెస్టిండీస్ సునాయాసంగా గెలుస్తుందని అందరూ భావించారు. కానీ భారత బౌలర్లు చెలరేగడంతో ఆరంభంలోనే గ్రీనిడ్జ్, డెస్మండ్, రిచర్డ్స్ త్వరగా ఔట్ కావడం భారత్కు కలిసివచ్చింది. మిగతా బ్యాట్స్మెన్ను కట్టడిచేయడం వల్ల ఆ జట్టు 140 పరుగులకే కుప్పకూలింది.

20 మీటర్లు పరుగెత్తి..
కపిల్ కమాల్ క్యాచ్తో భారత్ ఈ విజయాన్నందుకుంది. మదన్లాల్ వేసిన బంతిని వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ భారీషాట్ ఆడడం వల్ల బంతి గాల్లోకి లేచింది. అదే సమయంలో కపిల్దేవ్ ఏకంగా 20 మీటర్లు పరుగెత్తి కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఒకవేళ ఇది గనక పట్టి ఉండకపోతే రిచర్డ్స్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేవాడు. ఏదేమైనా ఈ ప్రపంచకప్తో కపిల్దేవ్ హీరో కావడమే కాకుండా ఎంతోమంది ఆటగాళ్లకు స్ఫూర్తిప్రదాతగా నిలిచాడు. ఇక ఇది జరిగి నేటికి 38 ఏళ్లు అయిన సందర్భంగా బీసీసీఐ ఈ చిరస్మరణీ రోజును అభిమానులకు గుర్తు చేస్తూ ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications












