క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మనే గొప్ప బ్యాటరని పాకిస్థాన్ బౌలర్ జునైద్ ఖాన్ అన్నాడు. ఓ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.
'భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ గొప్ప బ్యాటర్. అతని వద్ద అన్ని రకాల షాట్లు ఉన్నాయి. వన్డేల్లో మూడుసార్లు డబుల్ సెంచరీ చేశాడు. 264 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేశాడు. ఎక్కువ సిక్స్లు కొట్టింది కూడా అతనే. అందుకే రోహిత్ శర్మను హిట్ మ్యాన్ అని పిలుస్తారు. సచిన్ టెండూల్కర్ ఈ తరం ఆడుంటే 100 సెంచరీల కంటే ఎక్కువే చేసేవాడు.'అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు బదులుగా జునైద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

జునైద్ ఖాన్ 22 టెస్ట్లు, 76 వన్డేలు, 9 టీ20ల్లో పాకిస్థాన్కు ప్రాతినిథ్యం వహించాడు. టెస్ట్ల్లో 71, వన్డేల్లో 110, టీ20ల్లో 8 వికెట్లు పడగొట్టాడు. 2019 నుంచి అతను పాకిస్థాన్ జట్టుకు దూరంగా ఉంటున్నాడు.
ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచప్ 2023లో విరాట్ కోహ్లీ 50వ శతకం నమోదు చేసి సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించిన విషయం తెలిసిందే. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా చరిత్రకెక్కాడు. సచిన్ 100 రికార్డుల ఘనతను అందుకునే దిశగా సాగుతున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచి మ్యాన్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు.
ప్రపంచకప్ ఫైనల్ పరాజయం అనంతరం టీమిండియాకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు.. ప్రస్తుతం ఇంగ్లండ్లో కుటుంబంతో కలిసి విశ్రాంతి సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. సౌతాఫ్రికా పర్యటనలో వైట్ బాల్ సిరీస్లకు అందుబాటులో ఉండమని ఈ ఇద్దరూ బీసీసీఐకి సమాచారమిచ్చారు. దాంతో వీరిని పరిమిత ఓవర్ల సిరీస్లకు ఎంపిక చేయలేదు.
డిసెంబర్ 26న జరిగే బాక్సింగ్ డే టెస్ట్తో ఈ ఇద్దరూ మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ ఇద్దరూ వైట్బాల్ క్రికెట్కు దూరంగా ఉంటారనే ప్రచారం జరుగుతోంది. అయితే టీ20 ప్రపంచకప్ 2024ను రోహిత్, కోహ్లీ ఆడాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.