అసలు విషయం ఏంటంటే..
మూడు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన తొలి వన్డేలో నెదర్లాండ్ ఒక్కపరుగుతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 195 పరుగులకు ఆలౌటైంది. టీమ్లో వాన్ డీర్ గంగ్టన్ (53 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 49) మినహా ఎవరూ రాణించలేదు. ఐర్లాండ్ బౌలర్లలో జోషువా లిటిల్(3/32), క్రైగ్ యంగ్(3/34) మూడేసి వికెట్లతో రాణించారు. అనంతరం 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులే చేసి ఓటమిపాలైంది.

ఇన్నోవేటివ్ షాట్..
అయితే ఐర్లాండ్ విజయానికి చివరి ఓవర్లో 12 పరుగులు అవసరం అయ్యాయి. అప్పటివరకు నిలకడగా ఆడుతున్న సిమీ సింగ్(45) రనౌట్గా వెనుదిరిగాడు. దాంతో ఐర్లాండ్ ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ క్రీజులోకి వచ్చిన టెయిలెండర్ జోషెవా లిటిల్ రెండో బంతిని వృథా చేశాడు. దాంతో ఆ జట్టు విజయానికి 4 బంతుల్లో 9 పరుగులు అవసరమయ్యాయి. నెదర్లాండ్స్ పేసర్ లోగన్ వాన్ బీక్ మూడో బంతిని ఔట్సైడ్ ఆఫ్ప్టంప్ దిశగా వేశాడు. ఆ బంతిని ఎవరు ఊహించని విధంగా జోషుహా పూర్తిగా తిరిగి ఫైన్ లెగ్ దిశగా బౌండరీ బాదాడు.

14 ఏళ్ల తర్వాత..
అలా ఒక బౌలర్ ర్యాంప్ షాట్ ఆడడం చాలా అరుదు. దీనిని చూసిన నెదర్లాండ్స్ ఆటగాళ్లు కాస్త ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే చివరి బంతికి 3 పరుగులు అవసరం కాగా.. జోషుహా మరోసారి అదే తరహా షాట్కు ప్రయత్నించగా.. ఈ సారి బంతి బ్యాట్కు తగలకపోవడంతో బై రూపంలో ఒక పరుగు మాత్రమే వచ్చింది. అలా నెదర్లాండ్స్ ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. అయితే జోషుహా షాట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ గెలుపుతో 14 ఏళ్ల తర్వాత ఐర్లాండ్పై నెదర్లాండ్ గెలిచినట్లు అయింది. వన్డేల్లో చివరిసారిగా ఐర్లాండ్పై నెదర్లాండ్ 2007లో గెలుపొందింది.


Click it and Unblock the Notifications












