పోర్ట్ ఆఫ్ స్పెయిన్: తమ కుమారుడు ఐపీఎల్లో విరాట్ కోహ్లీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తరఫున ఆడితే తమ కల నెరవేరినట్లేనని వెస్టిండీస్ యువ వికెట్ కీపర్ జోషువా డిసిల్వా తల్లిదండ్రులు అన్నారు. విరాట్ కోహ్లీకి వీరాభిమానులు అయిన జోషువా తల్లిదండ్రులు.. వెస్టిండీస్కు ప్రాతినిథ్యం వహించడం కంటే ఆర్సీబీ తరఫున ఆడటాన్నే గొప్పగా భావిస్తున్నారు.
ఆర్సీబీ తరఫున జోషువా ఆడితే చాలని, తమకు అదే పదివేలని తెలిపారు. భారత్-వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ సందర్భంగా.. జోషువా తల్లి విరాట్ కోహ్లీని ప్రత్యేకంగా కలిసిన విషయం తెలిసిందే. రెండో టెస్ట్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా.. వికెట్ల వెనుకాల ఉన్న జోషువా.. 'నా తల్లికి నువ్వంటే పిచ్చి అభిమానం. నీ ఆటను చూసేందుకే ఆమె ఈ మ్యాచ్కు వచ్చారు'అని తెలపడం స్టంప్ మైక్లో రికార్డు అయ్యింది.

మ్యాచ్ పూర్తయిన తర్వాత జోషువా స్వయంగా తన తల్లి కోహ్లీ దగ్గరికి తీసుకెళ్లగా ఆమె ఉబ్బితబ్బిబ్బైంది. కోహ్లీని హత్తుకొని సంతోషం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. తాజాగా జోషువా తల్లిదండ్రులు ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తన కొడుకు ఐపీఎల్లో ఆర్సీబీకి ఆడితే చూడాలనుకుంటున్నామని, అంతకు మించి ఏ కోరికలు లేవని చెప్పారు. 'ఒకవేళ జోషువా ఐపీఎల్లో విరాట్ కోహ్లీ ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్సీబీ తరఫున ఆడితే.. అది తమకు గర్వకారణం. ఆ క్షణాన్ని ఎప్పటికి మరిచిపోలేం. అలా జరిగితే మా కల నెరవేరినట్లే. విరాట్ కోహ్లీ అంటే నాకు పిచ్చి.
అతనికి నేను విరాభిమానిని. ఎందుకంటే అతను అన్ని కలగలిపిన ప్లేయర్. అతనిలో ఓ ఫ్యామిలీ మ్యాన్ ఉన్నాడు. టీమ్ కోసం ఆడే వ్యక్తి కనిపిస్తాడు. అతని క్రమశిక్షణ అందరు తల్లులూ కోరుకునేలా ఉంది. 'అని జోషువా తల్లి పేర్కొంది. జోషువా తండ్రి సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.జోషువా ఆర్సీబీ తరఫున బరిలోకి దిగితే అంతుకు మించిన ఆనందం తమకు మరొకటి ఉండదన్నాడు.
వెస్టిండీస్తో జరిగిన రెండు టెస్ట్ల సిరీస్ను టీమిండియా 1-0తో కైవసం చేసుకుంది. రెండో టెస్ట్ వర్షం కారణంగా డ్రా అయిన విషయం తెలిసిందే. జూలై 27(గురువారం) నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.