సొంతగడ్డపై న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుంటే ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హజెల్ వుడ్ మాత్రం భయాందోళన వ్యక్తం చేశాడు. సొంతగడ్డపై ఘోర పరాజయం ఎదుర్కొన్న టీమిండియాతో మరింత ప్రమాదమని తమ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను హెచ్చరించాడు.
ఈ ఘోర పరాజయం.. నిద్రపోతున్న పులిని లేపినట్లేనని, టీమిండియా మరింత కసిగా ఆడుతుందని చెప్పాడు. న్యూజిలాండ్ చేతిలో ఖంగుతిన్న టీమిండియా.. తమ అప్కమింగ్ సిరీస్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆతిథ్య ఆసీస్తో అమీతుమీ తేల్చుకోనుంది.

నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభమయ్యే తొలి మ్యాచ్తో ఈ సిరీస్కు తెరలేవనుంది. ఈ సిరీస్ నేపథ్యంలో మాట్లాడిన హజెల్ వుడ్.. టీమిండియాను ఏ మాత్రం తక్కువ అంచనా వేయవద్దని తన సహచర ఆటగాళ్లకు సూచించాడు.
'ఈ ఘోర పరాజయంతో టీమిండియా మరింత కసిగా ఆడుతోంది. ఈ ఓటమి నిద్రపోతున్న పులిని లేపినట్లే. 3-0తో గెలవడం కంటే 0-3తో ఓడిపోవడమే టీమిండియాకు కలిసొచ్చే అంశం. వారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లవచ్చు. కానీ టీమిండియాలో చాలా మందికి ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన అనుభవం ఉంది. మరికొందరికి మాత్రం కొత్త. ఈ విజయం క్రెడిట్ న్యూజిలాండ్దే.
అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు. భారత గడ్డపై ఒక్క మ్యాచ్ గెలవడమే గొప్ప అంటే.. సిరీస్ కైవసం చేసుకున్నారు. టీమిండియాతో సిరీస్ అంటే మాకు యాషెస్లాంటిదే. ఇది చాలా పెద్ద సిరీస్. ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరవుతారనుకుంటున్నాను. టీవీ రేటింగ్స్ కూడా అమాంతం పెరుగుతాయని, క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద సిరీస్గా నిలిచిపోతుందని ఆశిస్తున్నాను.'అని జోష్ హజెల్ వుడ్ చెప్పుకొచ్చాడు.