బ్యాటింగ్ వైఫల్యమే మరోసారి తమ ఓటమిని శాసించిందని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన ఆఖరి మ్యాచ్లో సమష్టిగా చెలరేగిన భారత్ 142 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన జోస్ బట్లర్.. సిరీస్ మొత్తం తమ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగిందని తెలిపాడు.
మళ్లీ అదే కథ..
'ఈ సిరీస్ మొత్తం మా బ్యాటింగ్ ఒకేలా సాగింది. మేం అద్భుతమైన జట్టు చేతిలో ఓటమిపాలయ్యాం. మా బ్యాటింగ్ అప్రోచ్ బాగానే ఉంది. కానీ మేం మా ప్రణాళికలకు తగ్గట్లు ఆడలేకపోయాం. భారత్ మా ముందు భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. శుభ్మన్ గిల్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. మేం మరోసారి గొప్ప ఆరంభాన్ని అందుకున్నాం. కానీ గత మ్యాచ్ల కథనే రిపీట్ అయ్యింది. సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్ చేసే మార్గం కనుగొనాలి. మేం ఓ మెరుగైన జట్టుకు వ్యతిరేకంగా నిలబడ్డాం. ఇది సవాల్తో కూడుకున్న వ్యవహారం.'అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.

శతక్కొట్టిన శుభ్మన్ గిల్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. శుభ్మన్ గిల్ (102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లతో 112) శతకంతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(55 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 52), శ్రేయస్ అయ్యర్(64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 78) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్(4/64) నాలుగు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్(2/45) రెండు వికెట్లు పడగొట్టాడు. సకీబ్ మహ్మూద్, గస్ అట్కిన్సన్, జోరూట్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకు కుప్పకూలి ఓటమిపాలైంది. టామ్ బాంటన్(41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 38), గస్ అట్కిన్సన్(19 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.