Jos Buttler: వన్డే ప్రపంచకప్ 2023లో ఎదురైన వరుస పరాజయాలు తమను తీవ్రంగా నిరాశపరిచాయని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. ఇంగ్లండ్ పేలవ ప్రదర్శనకు ప్రస్తుతం తన దగ్గర సమాధానమే లేదని చెప్పాడు. మెగా టోర్నీలో భాగంగా గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఈ పరాజయంతో సెమీస్ రేసు నుంచి ఇంగ్లండ్ తప్పుకుంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన జోస్ బట్లర్.. తమ పరాజయాలపై స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. టోర్నీలో మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు.

'మా ఊహకందని రీతిలో సాగిన ఈ టోర్నీ తీవ్రంగా నిరాశపరిచింది. వ్యక్తిగతంగానూ ఈ పరాజయాలను జీర్ణించుకోలేకపోతున్నాను. నేను కాదు జట్టులోని ఆటగాళ్లంతా నిరాశకు గురయ్యారు. మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాం. మాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే? నా దగ్గర స్పష్టమైన సమాధానం లేదు.
మా ఆటగాళ్ల ప్రదర్శనను నిందించలేం. కానీ మా స్థాయికి తగ్గట్లు మాత్రం రాణించలేకపోయాం. కెప్టెన్సీ నుంచి అన్ని విభాగాల్లో విఫలమయ్యాం. కెప్టెన్గా ముందుండి నడిపించాల్సిన నేను కూడా అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోయాను. నిజాయితీగా చెప్పాలంటే మా ఆత్మవిశ్వాసం ఏ మాత్రం సన్నగిల్లలేదు.
ఎంతో అనుభవం కలిగిన ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు. ఎంతో ఆత్మవిశ్వాసం కలిగిన ఆటగాళ్లు వారంతా. కానీ మేం అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయాం.
ఓ ఆటగాడు రాత్రికి రాత్రే చెత్త ప్లేయర్ కాలేడు. అలాగే ఓ జట్టు కూడా రాత్రికి రాత్రే చెత్త టీమ్ కాదు. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం. అదే మా కొంపముంచింది. సెలెక్షన్ విషయంలో ఎలాంటి తప్పిదాలు చేయలేదు. ఇది పెద్ద సమస్యే కాదు.
బేసిక్ తప్పిదాలతోనే మూల్యం చెల్లించుకున్నాం. ఈ రోజు జోరూట్ రనౌట్ కావడం మా పతనాన్ని శాసిచింది. సాధారణంగా మేము ఇలాంటి తప్పిదాలు చేయం. భాగస్వామ్యాలు నెలకొల్పడంలో మేం విఫలమయ్యాం. కనీస ప్రదర్శన కనబర్చలేకపోయాం.
ఏదీ ఏమైనా పటిష్ట జట్టుగా మేం నెలకొల్పిన ప్రమాణాల పట్ల గర్వపడుతున్నాం. మిగిలిన టోర్నీలో ఏం జరిగినా.. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తాం.'అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 156 పరుగులకే కుప్పకూలింది. బెన్ స్టోక్స్(73 బంతుల్లో 6 ఫోర్లతో 43), జానీ బెయిర్ స్టో(31 బంతుల్లో 3 ఫోర్లతో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార(3/35), ఏంజెలో మాథ్యూస్(2/14), కాసున్ రజితా (2/36), మహీశ్ తీక్షణ(1/21) ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 25.4 ఓవర్లలో 2 వికెట్లకు 160 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సంక(83 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 77 నాటౌట్), సదీరవిక్రమా(54 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 65 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.