విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల వెంట కుటుంబ సభ్యులను అనుమతించడంపై ఆంక్షలు విధిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తీసుకొచ్చిన రూల్ను ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తప్పుబట్టాడు. ఆటగాళ్ల వెంట కుటుంబ సభ్యులు ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డాడు.
కుటుంబ సభ్యులు వెంట రావడం వల్ల ఆటగాళ్లపై ఎలాంటి ప్రభావం ఉండదన్నాడు. ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు.. భారత్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా బుధవారం కోల్కతా వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో జోస్ బట్లర్ మంగళవారం మీడియాతో మాట్లాడాడు.

ఈ సందర్భంగా బీసీసీఐ రూల్ను బట్లర్ ముందు ప్రస్తావించగా.. అతను తప్పుబట్టాడు. 'కుటుంబమే మా తొలి ప్రాధాన్యత. వారు మా వెంట ఉంటేనే ఆటను ఆస్వాదించేందుకు అవకాశం ఉంటుంది. విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల భార్యలు, కుటుంబ సభ్యులు వెంట ఉండటం వల్ల ధ్రుడంగా ఉంటారు.
క్రికెట్తో పాటు కుటుంబ సభ్యులను సమన్వయం చేసుకునే సత్తా ఇప్పటి ఆటగాళ్లకు ఉంది. విదేశీ పర్యటనల్లో కుటుంబ సభ్యులు వెంట ఉండటం చాలా ముఖ్యం. ఇది ఆటగాళ్లు మెరుగ్గా రాణించేందుకు సహకరిస్తోంది. విదేశీ పర్యటనల వల్ల ఆటగాళ్లు ఇంటికి దూరంగా ఎక్కువ కాలం ఉండాల్సి వస్తోంది. కరోనా అనంతరం ఆటగాళ్లతో కుటుంబ సభ్యులు రావడం ఎక్కువైంది. 'అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.
టీమిండియా వరుస పరాజయాల నేపథ్యంలో జట్టును గాడిన పెట్టేందుకు బీసీసీఐ 10 కఠిన నిబంధనలను తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో విదేశీ పర్యటనల్లో ఆటగాళ్లతో కుటంబ సభ్యులను అనుమితంచడంపై ఆంక్షలు విధించడం కూడా ఉంది. ఈ రూల్ ప్రకారం 15 రోజులకు మించి విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల వెంట కుటుంబ సభ్యులను అనుమితించరు. అందుబాటులో ఉన్న ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలనేది కూడా ఓ నిబంధనగా ఉంది. అయితే ఈ రూల్స్పై అధికారిక ప్రకటన రాలేదు. కానీ మీడియాకు లీకయ్యాయి.