బౌలింగ్ వైఫల్యమే తమ ఓటమికి కారణమని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. బౌలింగ్లో 20-25 పరుగులు అదనంగా ఇచ్చామని, అవే తమ పతనాన్ని శాసించాయని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా టీమిండియాతో గురువారం జరిగిన సెమీఫైనల్-2లో సమష్టిగా విఫలమైన ఇంగ్లండ్ 68 పరుగుల తేడాతో చిత్తయ్యింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 57)హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 47), హార్దిక్ పాండ్యా(13 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 23) దూకుడుగా ఆడారు.

ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు తీయగా.. రీస్ టోప్లీ, జోఫ్రా ఆర్చర్, సామ్ కరణ్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ భారత స్పిన్నర్ల ధాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది.
జోస్ బట్లర్(15 బంతుల్లో 4 ఫోర్లతో 23), హ్యారీ బ్రూక్(19 బంతుల్లో 3 ఫోర్లతో 25) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మూడేసి వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు పడగొట్టాడు.
టీమిండియా అద్భుతం..
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన జోస్ బట్లర్.. టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించాడు. భారత ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారని కొనియాడాడు. ఈ విజయానికి వారు పూర్తి అర్హులని పేర్కొన్నాడు. 'ఇండియా అసాధారణ ప్రదర్శనతో మమ్మల్ని చిత్తు చేసింది. మేం 20-25 పరుగులు ఎక్కువగా ఇచ్చాం.
సవాల్తో కూడుకున్న వికెట్పై భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. అన్ని విభాగాల్లో మా కంటే మెరుగైన ప్రదర్శన చేసిన భారత ఆటగాళ్లు ఈ విజయానికి పూర్తి అర్హులు. గత టీ20 ప్రపంచకప్కు ప్రస్తుత మ్యాచ్కు భిన్నమైన పరిస్థితులు. ఈ గెలుపు క్రెడిట్ భారత్దే. వాళ్లు మంచి క్రికెట్ ఆడారు.
స్పిన్నర్లు చెలరేగారు..
వర్షం వచ్చే పరిస్థితుల మధ్య పిచ్ ఇంతలా మారుతుందని ఊహించలేదు. భారత బౌలర్లు అసాధారణ ప్రదర్శన చేశారు. ఈ వికెట్పై చేయాల్సిన లక్ష్యం కంటే టీమిండియా ఎక్కువ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడమే తప్పిదంగా భావించడం లేదు. భారత్కు వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. మా స్పిన్నర్లు రషీద్, లివింగ్ స్టోన్ కూడా అద్భుత ప్రదర్శన చేశారు.
మేం మొయిన్ అలీతో బౌలింగ్ చేయించాల్సింది. ఈ వికెట్పై కావాల్సిన లక్ష్యం కంటే ఎక్కువ పరుగులు చేయడంతో పాటు అద్భుతమైన బౌలింగ్ అటాక్తో భారత్ మా ఓటమిని శాసించింది. ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్యాన్ని చేధించడం చాలా కష్టం. ఈ టోర్నీలో మా జట్టు కనబర్చిన ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది.
మాకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. అయినా సమష్టి ప్రదర్శనతో ఇక్కడిదాకా వచ్చాం. మేం గుడ్ క్రికెట్ ఆడాం. కానీ కీలక పోరులో ఆ జోరును కొనసాగించలేకపోయాం'అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.