కంకషన్ సబ్స్టిట్యూట్గా హర్షిత్ రాణాను ఆడించడం సరికాదని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. కంకషన్ రూల్స్కు ఇది విరుద్దమని అభిప్రాయపడ్డాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా పుణె వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 15 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో 3-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.
అయితే ఈ మ్యాచ్లో హర్షిత్ రాణా కంకషన్ సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగి మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ కనబర్చాడు. మూడు కీలక వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. శివమ్ దూబే కంకషన్ గాయానికి గురవ్వడంతో అతని స్థానంలో బరిలోకి దిగాడు. భారత బ్యాటింగ్ సందర్భంగా ఆఖరి ఓవర్లో శివమ్ దూబే హెల్మెట్కు బంతి బలంగా తాకింది. దాంతో కంకషన్ రూల్స్ వాడుకున్న టీమిండియా తెలివిగా.. హర్షిత్ రాణాను బరిలోకి దించి ఆశించిన ఫలితాన్ని అందుకుంది.

రూల్స్కు విరుద్దంగా..
అయితే బ్యాటింగ్ ఆల్రౌండర్ స్థానంలో స్పెషలిస్ట్ పేసర్ అయిన హర్షిత్ రాణాను ఎలా ఆడిస్తారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఐసీసీ రూల్ 1.2.7.3.4 ప్రకారం.. కంకషన్ గాయానికి గురైన ఆటగాడి స్థానంలో అతనికి సరిపోయే ప్లేయర్ను మాత్రమే బరిలోకి దించాలి. బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన శివమ్ దూబే స్థానంలో మరో బ్యాటింగ్ ఆల్రౌండర్ను ఆడించాల్సి ఉంది. కానీ భారత్ హర్షిత్ రాణాను ఆడించడం వివాదాస్పదమైంది.
ఇది అన్యాయం..
మ్యాచ్ అనంతరం మీడియాలో మాట్లాడిన జోస్ బట్లర్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశాడు. ఇది అన్యాయమని అభిప్రాయపడ్డాడు.'ఇది ఏమాత్రం సరైన రిప్లేస్మెంట్ కాదు. శివమ్ దూబేకు హర్షిత్ రాణా ఏమాత్రం సరిపోలే ఆటగాడు కాదు. ఈ కంకషన్ సబ్స్టిట్యూట్ను మేం ఏ మాత్రం అంగీకరించం. శివమ్ దూబే గంటకు 25 మైల్స్ వేగంతో బౌలింగ్ చేసినా.. హర్షిత్ రాణా తన బ్యాటింగ్ను మెరుగుపరుచుకున్నా.. అది ఆటలో భాగమే. ఈ మ్యాచ్లో మేం గెలవాల్సింది. ఈ నిర్ణయం మా ఓటమిని ప్రభావితం చేసింది. ఈ సబ్స్టిట్యూట్ను మేం ఏమాత్రం అంగీకరించం.
మాకు చెప్పకుండానే..
మమ్మల్ని సంప్రదించకుండానే హర్షిత్ రాణాను కంకషన్ సబ్స్టిట్యూట్గా బరిలోకి దించారు. నేను ఔటైన తర్వాతే హర్షిత్ రాణా కంకషన్ సబ్స్టిట్యూట్ అనే విషయం తెలిసింది. వెంటనే నేను హర్షిత్ రాణా ఎందుకు ఆడుతున్నాడని అంపైర్లను ప్రశ్నించాను. వారు కంకషన్ రిప్లేస్మెంట్ అని బదులిచ్చారు. ఈ నిర్ణయాన్ని నేను వ్యతిరేకించాను. ఇది ఏ మాత్రం సరిపోయే రిప్లేస్మెంట్ కాదు. మ్యాచ్ రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారని అంపైర్లు చెప్పారు.
మమ్మల్ని సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు. మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్తో ఈ విషయంపై మాట్లాడుతాం. మాకు ఉన్న కొన్ని సందేహాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతాం.'అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.