టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగే తమ ఓటమికి ప్రధాన కారణమని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. బ్యాటింగ్లో 30-50 పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా కటక్ వేదికగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన జోస్ బట్లర్.. బ్యాటింగ్లో తమ జట్టు ఇంకాస్త మెరుగైన ప్రదర్శన చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ ఒంటి చేత్తో తమ ఓటమిని శాసించాడని చెప్పాడు. 'ఈ మ్యాచ్లో మేం చాలా విషయాల్లో మెరుగ్గా రాణించామని అనుకున్నా. బ్యాటింగ్లో మెరుగైన ప్రదర్శనే చేశాం. అయితే ఎవరో ఒకరు జట్టు స్కోర్ను 350 వరకు తీసుకెళ్లాల్సింది. ఈ గెలుపు క్రెడిట్ రోహిత్ శర్మదే. అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.

వన్డే క్రికెట్లో గత కొన్నేళ్లుగా అతను ఇలానే రాణిస్తున్నాడు. స్కోర్ బోర్డుపై భారీ లక్ష్యాన్ని ఉంచాలనుకున్నాం. కానీ చేయలేకపోయాం. భారత్ మాత్రం అద్భుతంగా ఆడింది. మేం పవర్ ప్లేలో అద్భుతంగా ఆడాం. కానీ మాలో ఎవరో ఒకరు జట్టు స్కోర్ 330-350 వరకు తీసుకెళ్లాల్సింది. అప్పుడు కాపాడుకోవడానికి ఆస్కారం లభించేది. ఫలితాలు అనుకూలంగా లేకున్నా.. సానుకూల దృక్పథంలో ముందకు సాగాలి.'అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకే ఆలౌటైంది. బెన్ డక్కెట్(56 బంతుల్లో 10 ఫోర్లతో 65), జోరూట్(72 బంతుల్లో 6 ఫోర్లతో 69) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/35) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.
అనంతరం భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లకు 308 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ(90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్లతో 119) శతక్కొట్టగా.. శుభ్మన్ గిల్(52 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమీ ఓవర్టన్(2/27) రెండు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్ స్టోన్ తలో వికెట్ తీసారు.