Jos Buttler:టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకోవడం తమ పతనాన్ని శాసించిందని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా సౌతాఫ్రికాతో శనివారం జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 229 పరుగుల భారీ తేడాతో చిత్తయ్యింది. వన్డే వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం స్పందించిన జోస్ బట్లర్.. పేలవ బౌలింగ్తో పాటు చెత్త బ్యాటింగ్ జట్టుకు ఈ పరిస్థితిని తీసుకొచ్చిందని చెప్పాడు. ఉక్కపోత వాతావరణంలో ముందుగా బ్యాటింగ్ చేయడం ఇబ్బందిగా ఉంటుందనే బౌలింగ్ ఎంచుకున్నానని జోస్ బట్లర్ వివరణ ఇచ్చాడు. అయితే తన వ్యూహం బెడిసికొట్టిందని తెలిపాడు.

'నమ్మశక్యం కానీ పరాజయం ఇది. ఈ ఓటమి తీవ్రంగా నిరాశపరిచింది. బాగా ఆడాలనే కసితో ఈ మ్యాచ్ బరిలోకి దిగాము. కానీ అనూహ్య పరిస్థితులతో ఘోర పరాజయం చవి చూశాం. బౌలింగ్ మార్పులు, ఫీల్డ్ ప్లేస్మెంట్ పెద్ద సమస్య కాదు. తొలి ఇన్నింగ్స్లో చాలా విషయాలు మా ప్రణాళిక తగ్గట్లు జరగలేదు.
టోప్లీ గాయపడటం.. అతను మళ్లీ బౌలింగ్ చేస్తాడా? లేదా? అనే సందేహం నెలకొనడం. కొన్ని ఓవర్ల పాటు సరైన ప్లాన్ లేకుండా బౌలింగ్ చేయడం ఇబ్బందిగా మారింది. ప్రత్యర్థిని 340-350 పరుగులకు కట్టడి చేయాల్సింది. అప్పుడు చేజింగ్కు ఈజీగా ఉండేది. ముందుగా బౌలింగ్ చేయడం వ్యూహాత్మక తప్పిదమే. అయితే విపరీతమైన వేడి ఉన్న పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం ఇబ్బందిగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నాను.
పరిస్థితిలు బ్యాటింగ్కు చాలా ప్రతీకూలంగా ఉన్నాయి. ఉక్కపోత వాతావరణంలో బ్యాటింగ్ చేస్తే తిమ్మర్లు వస్తాయని భావించి బౌలింగ్ ఎంచుకున్నా. భారీ లక్ష్య చేధనలో మేం ఆశించిన శుభారంభం దక్కలేదు. అనవసర బంతులాడి వికెట్లు సమర్పించుకున్నారు. ఇక నుంచి మేం ప్రతీ మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది.'అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. హెన్రీచ్ క్లాసెన్(67 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లతో 109) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. రీజా హెండ్రీక్స్(75 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 85), రాసీ వాన్ డెర్ డస్సెన్(61 బంతుల్లో 8 ఫోర్లతో 60), మార్కో జాన్సెన్(42 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్లతో 75 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టోప్లీ(3/63) మూడు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్(2/61), గస్ అట్కిన్సన్కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 22 ఓవర్లలో 170 పరుగులకు కుప్పకూలింది. గెరాల్డ్ కోయిట్జ్ (3/35) మూడు వికెట్లతో చెలరేగగా.. లుంగి ఎంగిడి(2/26), మార్కో జాన్సెన్(2/35) రెండేసి వికెట్లు తీసారు. కగిసో రబడా, కేశవ్ మహరాజ్ తలో వికెట్ తీసారు.