తమ బ్యాటింగ్ వైఫల్యంతో పాటు శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ అసాధారణ భాగస్వామ్యం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. బ్యాటింగ్లో మరో 40-50 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా నాగ్పూర్ వేదికగా గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్(67 బంతుల్లో 4 ఫోర్లతో 52), జాకోబ్ బెతెల్(64 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/26), అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణా(3/53) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.

చెలరేగిన శుభ్మన్, అయ్యర్..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 38.4 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. శుభ్మన్ గిల్(96 బంతుల్లో 14 ఫోర్లతో 87 ), అక్షర్ పటేల్(47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 52 ) శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహ్మూద్(2/47), ఆదిల్ రషీద్(2/49) రెండేసి వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, జాకోబ్ బెతెల్ తలో వికెట్ పడగొట్టారు. లక్ష్యచేధనలో భారత్ 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోగా.. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ మూడో వికెట్కు 94 పరుగులు జోడించి గెలుపు బాట వేసారు.
వరుసగా వికెట్లు కోల్పోవడంతో..
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన జోస్ బట్లర్.. ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు. 'ఈ మ్యాచ్ గెలవకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది. పవర్ ప్లేలో మాకు అద్భుతమైన ఆరంభం దక్కిన తర్వాత కూడా ఉపయోగించుకోలేకపోయాం. ఓపెనర్లు శుభారంభం అందించినా.. వరుసగా నాలుగు వికెట్లు కోల్పోవడం అసహనానికి గురి చేసింది. మరో 40-50 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. టీమిండియా బ్యాటర్లను ఫాస్ట్ బౌలింగ్తో దెబ్బతీయాలనుకోలేదు. అస్సలు మేం ఇలా ఆడాలనుకోలేదు.
మా తప్పిదానికి ఆ ఇద్దరూ తోడయ్యారు..
ప్రత్యర్థిని ఒత్తిడిలో ఉంచి మూమెంటమ్ అందుకోవాలనుకున్నాం. అందుకు తగ్గట్లుగా మా బౌలర్లు అద్భుతమైన ఆరంభం అందించారు. 19 పరుగులకే 2 వికెట్లు తీసి టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టారు. కానీ శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ అసాధారణ బ్యాటింగ్తో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యం మా విజయవకాశాలను దెబ్బతీసింది. మేం మరింత మెరుగ్గా ఆడాలనుకుంటున్నాం. ఇప్పటికే మేం మా సత్తా ఏంటో చాలా సందర్భాల్లో చూపించాం. మాకు మూమెంటమ్ లభిస్తే దాన్ని వీలైనంతరం వరకు పొడిగించాలనుకుంటున్నాం.'అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.