అందుకే ఓడిపోయాం: జోస్ బట్లర్

సౌథాంప్టన్: ఇంగ్లండ్తో రీషెడ్యూల్ టెస్ట్లో ఓటమిపాలైన టీమిండియా.. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో మాత్రం శుభారంభం చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ రీఎంట్రీ ఇచ్చిన విశేషమో ఏమో కానీ.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో దుమ్మురేపింది. దాంతో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో భారత్ 50 పరుగుల భారీ విజయాన్నందుకుంది. దాంతో మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన జోస్ బట్లర్.. తమ జట్టు అన్ని విభాగాల్లో విఫలమైందని చెప్పాడు. బంతితో సెకండాఫ్లో పుంజుకున్నా.. బ్యాటింగ్లో విఫలమవడం విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసారని కొనియాడాడు. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ తన స్వింగ్తో అదరగొట్టాడని ప్రశంసించాడు.

స్వింగ్ను ఆడలేక..
'కొత్త బంతితో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి మమ్నల్ని ఒత్తిడిలోకి నెట్టారు. ఆరంభంలోనే వికెట్లు తీయడంతో మేం కోలుకోలేకపోయాం. బంతితో సెకండాఫ్లో రాణించినప్పటికీ.. బ్యాటింగ్లో విఫలమయ్యాం. భారత బౌలర్లు మా కన్నా అద్భుతంగా బంతిని స్వింగ్ చేశారు. భువనేశ్వర్ కుమార్ అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్వింగ్ చేయగలడు. టీ20 మ్యాచ్లో బంతి ఇంతలా స్వింగ్ కావడం చూసి చాలా రోజులు అయింది. అయితే బౌలర్లపై ఎదురుకుదాడి దిగి భారీ షాట్లు ఆడితే వారు ఒత్తిడికి గురయ్యేవారు. కానీ మేం అది చేయలేకపోయాం. అయితే మా ఆటగాళ్లకు అపార ప్రతిభ ఉంది. తదుపరి మ్యాచ్ల్లో మా తప్పిదాలను సవరించుకొని బరిలోకి దిగుతాం'అని బట్లర్ పేర్కొన్నాడు.

మెరిసిన హార్దిక్, సూర్య, హుడా..
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 198 పరుగుల భారీ స్కోర్ చేసింది. హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 51) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 39), దీపక్ హుడా ( 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 33) మెరుపులు మెరిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ (2/23), మొయిన్ అలీ (2/26) రెండేసి వికెట్లతో సత్తా చాటగా... టోప్లీ, టైమల్ మిల్స్, మాథ్యూ పార్కిన్సన్ తలో వికెట్ పడగొట్టాడు.

సూపర్ బౌలింగ్తో..
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. మొయిన్ అలీ (20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 36), హ్యారీ బ్రూక్ (23 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 28) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. హార్దిక్ పాండ్యా (4/33) నాలుగో వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. యుజ్వేంద్ర చాహల్ (2/32), అర్ష్దీప్ సింగ్ (2/18) రెండేసి వికెట్లు తీయగా.. భువీ ఓ వికెట్ పడగొట్టాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో సూపర్ స్వింగ్ డెలివరీతో కెప్టెన్ జోస్ బట్లర్ను భువీ ఔట్ చేసిన విధానం మ్యాచ్కే హైలైట్గా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications