
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ బ్యాటింగ్ స్టైల్ అంటే తనకు చాలా ఇష్టమని ఇంగ్లండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ జోస్ బట్లర్ తెలిపాడు. హిట్మ్యాన్ కొద్దీసేపు బ్యాటింగ్ చేసినా ఆ ప్రభావం మ్యాచ్ ఫలితంపై ఉంటుందని కొనియాడాడు. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ అయిన జోస్ బట్లర్.. తాజాగా ఆ జట్టు నిర్వహించిన ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో పాల్గొని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
రోహిత్ శర్మ ధాటికి ప్రత్యర్థి బౌలర్లు తమ వ్యూహాలనే మార్చుకున్నారని చెప్పుకొచ్చాడు. అప్పటి వరకూ షార్ట్ పిచ్ బంతులతో భారత బ్యాట్స్మెన్ను ఇబ్బందిపెట్టిన బౌలర్లు రోహిత్ రాకతో ఫుల్లర్ బంతులు వేస్తున్నారని ఈ రాజస్థాన్ ప్లేయర్ తెలిపాడు.
'రోహిత్ శర్మ అద్భుతమైన ఆటగాడు. అతను కొద్దిసేపు బ్యాటింగ్ చేసినా.. ఆ ప్రభావం కచ్చితంగా మ్యాచ్ ఫలితంపై ఉంటుంది. ఈ విషయం ఇప్పుడు చెప్పడం సందర్భం కాదు కానీ.. చెప్తున్నా. కొన్నేళ్ల క్రితం భారత ఆటగాళ్లపై ప్రత్యర్థి బౌలర్లు షార్ట్ పిచ్ బంతులతో దాడికి దిగేవారు. కానీ.. రోహిత్ శర్మ ఆ బంతుల్ని ఉతికారేయడం మొదలెట్టాడు. దీంతో.. వారు ఫుల్లర్ బంతుల్ని సంధించడం ప్రారంభించారు. అయినా.. రోహిత్ వాటిని కూడా వదిలిపెట్టకుండా బౌండరీకి తరలిస్తున్నాడు. అలవోకగా హిట్టింగ్ చేసే.. అతని బ్యాటింగ్ శైలంటే నాకిష్టం.'అని బట్లర్ పేర్కొన్నాడు.
ఇక ఇంగ్లండ్ వేదికగా గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్లో ఏకంగా ఐదు సెంచరీలు బాదిన హిట్మ్యాన్.. ఓ ప్రపంచకప్లో అత్యధిక శతకాలు చేసిన క్రికెటర్గా రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఈ క్యాష్ రిచ్లీగ్ కరోనా మహమ్మారి కారణంగా తొలుత ఏప్రిల్ 15కు వాయిదా పడింది. అయితే దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రభుత్వం లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించింది. దీంతో చేసేదేమి లేక బీసీసీఐ నిరవదికంగా వాయిదా వేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.