ఇంగ్లండ్తో మూడో టెస్ట్లో టీమిండియా ఓటమికి టాపార్డర్ వైఫల్యం కారణమని అందరూ భావిస్తున్నారు. కానీ ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ మాత్రం.. వాషింగ్టన్ సుందర్ రెచ్చగొట్టే ప్రసంగమే టీమిండియా ఓటమికి ప్రధాన కారణమని తెలిపాడు. నాలుగో రోజు ఆట అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్ స్కై స్పోర్ట్స్తో వాషింగ్టన్ సుందర్ మాట్లాడిన మాటలు ఇంగ్లండ్ ఆటగాళ్లను రెచ్చగొట్టాయని, మ్యాచ్ గెలవాలనే కసిని పెంచాయని అభిప్రాయపడ్డాడు. వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ కుర్రాడి పని పట్టండని కోచ్ మెక్కల్లమ్ సైగలు కూడా చేశాడని తెలిపాడు.
ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. టెయిలెండర్స్ సాయంతో ఆఖరి వరకు రవీంద్ర జడేజా పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ గెలుపుతో ఐదు టెస్ట్ల సిరీస్లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది.

ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో నాలుగు వికెట్లతో చెలరేగిన వాషింగ్టన్ సుందర్ను అధికారిక బ్రాడ్కాస్టర్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా సుందర్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్లో టీమిండియా సునాయసంగా విజయం సాధిస్తుందని చెప్పాడు. ఐదో రోజు లంచ్ తర్వాతే భారత్ విజయం పూర్తవుతుందని తెలిపాడు. తమకు సాలిడ్ బ్యాటింగ్ లైనప్ ఉందన్నాడు. ఈ వ్యాఖ్యలే ఇంగ్లండ్ ఆటగాళ్లను రెచ్చగొట్టాయని బట్లర్ తెలిపాడు. తాజాగా ఈ మ్యాచ్ ఫలితంపై ఓ యూట్యూబ్ షోలో మాట్లాడిన జోస్ బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'వాషింగ్టన్ సుందర్ చేసిన కామెంట్స్.. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ ఆటగాళ్లను ప్రేరేపించాయి. ఎలాగైనా మ్యాచ్ గెలవాలనే కసిని కలిగించాయి. వాషింగ్టన్ సుందర్ కామెంట్స్ గురించి విన్న తర్వాత.. నిజంగా అతను అలా అన్నాడా? అనిపించింది. భారత్ విజయం సాధిస్తుంది. మేం 2-1తో ఆధిక్యం సాధిస్తామని ఎంతో నమ్మకంతో సుందర్ అనడం వీడియోలో కనిపించింది. బహుషా అతను పొరబాటున ఈ వ్యాఖ్యలు చేశాడేమోనని అనుకున్నా. గెలవాలని ఆశిస్తున్నానని చెప్పబోయి గెలుస్తామని తప్పుగా పలికాడని భావించా. అయితే ఈ వీడియోను ఎవరో ఒకరు డ్రెస్సింగ్ రూమ్లో చూపించి ఉంటారు.
ఈ రోజుల్లో ఏది మిస్సవ్వరు కదా? ఐదో రోజు ఆట ప్రారంభానికి ముందు ఏం మాట్లాడకుండా ఇంగ్లండ్ ఆటగాళ్లందరికి ఈ వీడియో ప్లే చేసి చూపించి ఉంటారు. వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్ బాల్కానీ నుంచి మెక్కలమ్ 'ఎక్కువగా మాట్లాడింది ఇతనే.. మన సత్తా ఏంటో చూపించండి'అని సైగలు చేశాడు. ఓటమి తర్వాత తన వ్యాఖ్యల పట్ల వాషింగ్టన్ సుందర్ పశ్చాతాపానికి గురై ఉంటాడు'అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.