టీమిండియా ఆల్రౌండర్ శివమ్ దూబే క్యాచ్ను చేజార్చడం తమ ఓటమిని శాసించిందని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. ఈ క్యాచ్ పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా పుణె వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 15 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. ఈ గెలుపుతో 3-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన జోస్ బట్లర్.. శివమ్ దూబే ఎదుర్కొన్న తొలి బంతికే క్యాచ్ ఇచ్చాడని, అది వదిలేయడంతో తమ విజయవకాశాలను దెబ్బతిన్నయని తెలిపాడు. 'ఈ మ్యాచ్ను మేం అద్భుతంగా ప్రారంభించాం. పవర్ ప్లేలోనే కీలక వికెట్లు తీసుకున్నాం. బ్యాటింగ్ పవర్ ప్లేలో కూడా దూకుడుగా ఆడి మంచి శుభారంభం అందుకున్నాం. విజయం దిశగా సాగాం. ఈ మ్యాచ్ను మేం గెలవాల్సింది. కానీ మేం చేసిన కొన్ని తప్పిదాలు మా ఓటమిని శాసించాయి.

శివమ్ దూబే తాను ఎదుర్కొన్న తొలి బంతికే క్యాచ్ ఇచ్చాడు. కానీ మేం వదిలేసాం. ఈ అవకాశంతో అతను అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్లో మంచి స్థితిలో నిలిచిన తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాం. అయితే ఈ మ్యాచ్లో ఓడినా మాకు కొన్ని సానుకూలంశాలు ఉన్నాయి. మేం ఎలా ఆడాలనుకున్నామో అలానే ఆడాం. మరింత కమిట్మెంట్తో ఆడితే ఆశించిన ఫలితాలు దక్కుతాయి. 'అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును 87 పరుగుల భాగస్వామ్యంతో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే ఆదుకున్నారు. అయితే శివమ్ దూబే ఎదుర్కొన్న తొలి బంతికే స్లిప్లో క్యాచ్ ఇవ్వగా.. బట్లర్ నేలపాలు చేశాడు. అతను డైవ్ చేసినప్పటికీ బంతి చిక్కలేదు. ఈ అవకాశంతో దూబే హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా( 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 53), శివమ్ దూబే(34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహమూద్(3/35) మూడు వికెట్లు తీయగా.. జేమీ ఓవర్టన్(2/32) రెండు వికెట్లు పడగొట్టారు. బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. హ్యారీ బ్రూక్(26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది.