న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ 2023లో అఫ్గానిస్థాన్ చారిత్రాత్మక విజయాన్నందుకుంది. సంచలన ఆటతీరుతో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ను మట్టికరిపించింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో అసాధారణ ప్రదర్శనతో ఇంగ్లండ్ను 69 పరుగుల తేడాతో చిత్తు చేసింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు అఫ్గానిస్థాన్ రెండు మ్యాచ్లు మాత్రమే గెలవగా.. అందులో ఇదొక మ్యాచ్ కావడం విశేషం.
ఈ టోర్నీలో అఫ్గాన్కు ఇదే తొలి విజయం. 2019 వన్డే ప్రపంచకప్లో ఒక్క విజయం కూడా నమోదు చేయని అఫ్గాన్.. 2015 వన్డే వరల్డ్కప్లో స్కాట్లాండ్పై తొలి విజయాన్ని అందుకుంది. అలాంటి అఫ్గానిస్థాన్ డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ బెస్ట్ టీమ్ అయిన ఇంగ్లండ్ను ఓడించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

అయితే అఫ్గాన్ సాధించిన ఈ విజయం వెనుక ఇంగ్లండ్ మాజీ క్రికెటరే ఉన్నాడు. భారత్ వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్లో ఇంగ్లండ్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచిన ఆ మాజీ ఆటగాడే ప్రస్తుత అఫ్గానిస్థాన్ టీమ్ హెడ్ కోచ్. అతను ఎవరో కాదు జోనాథన్ ట్రాట్. ఇంగ్లండ్ ప్లేయర్గా 68 వన్డేలు, 52 టెస్ట్లు, 7 టీ20లు ఆడిన ట్రాట్.. మూడు ఫార్మాట్లలో కలిపి 6700కు పైగా పరుగులు చేశాడు.
ఇందులో 13 సెంచరీలు, 41 హాఫ్ సెంచరీలున్నాయి. ఇంగ్లండ్ మాజీ ఆటగాడైన జోనాథన్ ట్రాట్ అఫ్గాన్ కోచ్గా ఆ జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. తన జట్టుకే ఘోర పరాభావాన్ని మిగిల్చాడు. దాంతో అభిమానులు సెటైర్లు పేల్చుతున్నారు. శత్రువులు ఎక్కడో ఉండరని, మాజీ క్రికెటర్ల రూపంలో చుట్టూనే ఉంటారని కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్(57 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లతో 80), ఇక్రామ్ అలిఖిల్(66 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 58) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్(3/42) మూడు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్(2/50) రెండు వికెట్లు పడగొట్టాడు. లియామ్ లివింగ్స్టోన్(1/33), జోరూట్(1/19)తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలింది. హ్యారీ బ్రూక్(61 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 66) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ నబీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఫజలక్ ఫరూకీ, నవీన్ ఉల్ హక్ తలో వికెట్ తీసారు.