
మా బౌలర్లదే క్రెడిట్..
'విరాట్ను త్వరగా ఔట్ చేసిన క్రెడిట్ అంతా మా బౌలర్లదే. అతనో వరల్డ్ క్లాస్ ప్లేయర్. అలాంటి వ్యక్తిని పరుగులు చేయకుండా అడ్డుకోవడం అంటే ఆశమాషి వ్యవహారం కాదు. ఈ క్రెడిట్ మా బౌలింగ్ గ్రూప్ మొత్తానిది. ఇక ముందు కూడా మేం కోహ్లీని ఇలానే అడ్డుకోవాలి. లేదంటే సిరీస్ గెలవడం కష్టం. సిరీస్ గెలవాలంటే కోహ్లీని వీలైనంత త్వరగా పెవిలియన్ చేర్చడం ముఖ్యం. అతన్ని ఔట్ చేయడానికి గల మార్గాలను మేం కనుగొన్నాం అతనో అద్భతమైన బ్యాట్స్మన్. టెస్ట్ క్రికెట్లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఇక మీదట కూడా అతన్ని త్వరగా ఔట్ చేయడానికి గల వ్యూహాలను రచించాలి.'అని జోరూట్ వర్చువల్ మీడియా సమావేశంలో తెలిపాడు.

దెబ్బతిన్న భారత్ దెబ్బ తెలుసు..
గత మ్యాచ్లో గెలిచామని తమ జట్టు ఎక్కడా రిలాక్స్ అవ్వడం లేదని జోరూట్ తెలిపాడు. దెబ్బతిన్న భారత్ ఎలా దెబ్బకొడుతుందో తమకు తెలుసని, దానికి తగ్గట్లు సమాయత్తం అవుతున్నామన్నాడు. 'విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు ఎలా బదులిస్తుందో మాకు తెలుసు. గత మ్యాచ్లో గెలిచామని ఎక్కడా కూడా మేం అలక్ష్యంగా ఉండటం లేదు. టాప్ క్లాస్ టీమ్ అయిన కోహ్లీసేన ఎంత కసిగా బరిలోకి దిగుతుందో తెలుసు. దానికి తగ్గట్లు మేం కూడా హార్డ్ వర్క్ చేస్తున్నాం. మైదానంలో లభించే అడ్వాంటేజ్లతో మేం పై చేయి సాధించే ప్రయత్నం చేస్తున్నాం'అని జోరూట్ చెప్పుకొచ్చాడు.

కొనసాగుతున్న కోహ్లీ వైఫల్యం..
ఇంగ్లండ్ గడ్డపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫల్యం కొనసాగుతోంది. మూడు టెస్ట్ల్లో ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్లు ఆడిన విరాట్.. చివరి ఇన్నింగ్స్లో అవస్థ పడుతూ హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ముఖ్యంగా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ ఆడేందుకు తెగ ఇబ్బంది పడుతున్నాడు. ఈ బంతులకే కోహ్లీ ఐదు సార్లు ఔటయ్యాడు. కీపర్ క్యాచ్ లేదంటే గల్లీలో దొరికిపోతున్నాడు. ముఖ్యంగా జేమ్స్ అండర్సన్ బౌలింగ్ను ఆడలేకపోతున్నాడు. 2014 పర్యటనలోని గడ్డు పరిస్థితులను గుర్తు చేస్తున్నాడు. ఈ పర్యటనలో ఇప్పటికే అండర్సన్ బౌలింగ్లో కోహ్లీ రెండు సార్లు ఔటయ్యాడు. కనీసం నాలుగో టెస్ట్లోనైనా అతను రాణించాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ మాత్రం మూడు టెస్ట్ల్లో మూడు సెంచరీలు బాదాడు.


Click it and Unblock the Notifications












