ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక శతకాలు నమోదు చేసిన నాలుగో బ్యాటర్గా నిలిచాడు. భారత్తో ఓవల్ వేదికగా ఆదివారం ముగిసిన ఆఖరి టెస్ట్లో 137 బంతుల్లో సెంచరీ సాధించిన జోరూట్ కెరీర్లో 39వ టెస్ట్ శతకం నమోదు చేశాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర 38 సెంచరీల రికార్డ్ను అధిగమించాడు. భారత్తో జరిగిన నాలుగో టెస్ట్లోనే సంగక్కర రికార్డ్ను సమం చేసిన జోరూట్.. తాజా మ్యాచ్లోనూ సెంచరీతో చెలరేగి అతన్ని వెనక్కినెట్టాడు. టెస్ట్ల్లో అత్యధిక శతకాలు బాదిన బ్యాటర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్(51), జాక్వస్ కల్లీస్(45), రికీ పాంటింగ్(41) మాత్రమే జోరూట్(39) కంటే ముందున్నారు.
ఆఖరి టెస్ట్లో 374 పరుగుల లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 106 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన జోరూట్.. హ్యారీ బ్రూక్(111) సాయంతో జట్టును ఆదుకున్నాడు. నాలుగో వికెట్కు 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ క్రమంలో జోరూట్ పలు రికార్డ్లను తన పేరిట లిఖించుకున్నాడు.

టెస్ట్ క్రికెట్లో భారత్పై అత్యధిక సార్లు 500 ప్లస్ రన్స్ చేసిన బ్యాటర్గా నిలిచాడు. 2021-22లో భారత్తో జరిగిన ఐదు టెస్ట్ల సిరీస్లో జో రూట్ 737 పరుగులు చేశాడు. 2014లో భారత్తో ఏడు ఇన్నింగ్స్ల్లో 518 పరుగులు, తాజా సిరీస్లో 500 ప్లస్ రన్స్ చేశాడు. 2012లో నాగ్పూర్ వేదికగా భారత్తో జోరూట్ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.
భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్ల్లో విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్లు రెండేసి సార్లు 500 ప్లస్ రన్స్ చేశాడు. ఓ టెస్ట్ సిరీస్లో ఇంగ్లండ్ తరఫున వ్యాలీ హామ్మోండ్, జాక్ హోబ్స్, కెన్ బార్రింగ్టన్ నాలుగేసి సార్లు 500 ప్లస్ రన్స్ చేశారు.