ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్తో మంగళవారం ఉత్కంఠగా సాగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. పరుగుల వరద పారిన ఈ హైస్కోరింగ్ థ్రిల్లర్లో జితేష్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్తో ఆర్సీబీ విజయాన్నందుకుంది. దాంతో రిషభ్ పంత్ శతకం వృథా అయ్యింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. రిషభ్ పంత్(61 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్లతో 118 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. మిచెల్ మార్ష్(37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 67) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్కు 155 పరుగులు జోడించారు. ఆర్సీబీ బౌలర్లలో నువాన్ తుషార, భువనేశ్వర్ కుమార్, రొమారియో షెపర్డ్ చెరో వికెట్ తీసారు.
అనంతరం ఆర్సీబీ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 230 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ(30 బంతుల్లో 10 ఫోర్లతో 54), జితేశ్ శర్మ(33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 85 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఫిల్ సాల్ట్(19 బంతుల్లో 6 ఫోర్లతో 30), మయాంక్ అగర్వాల్(23 బంతుల్లో 5 ఫోర్లతో 41 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. లక్నో బౌలర్లలో విల్ ఓరూర్కీ రెండు వికెట్లు తీయగా.. ఆకాశ్ సింగ్, ఆవేశ్ ఖాన్ చెరో వికెట్ తీసారు. ఐపీఎల్ చరిత్రలోనే ఆర్సీబీకి ఇది అతిపెద్ద ఛేజింగ్.

అదిరిపోయే ఆరంభం..
228 పరుగుల భారీ లక్ష్యచేధనలో ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడారు. తొలి ఓవర్ నుంచే బౌండరీల మోత మోగించారు. దాంతో ఆర్సీబీ 4 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ఆకాశ్ సింగ్ విడదీసాడు. ఫిల్సాల్ట్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 61 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన రజత్ పటీదార్ ఓ భారీ సిక్సర్తో పాటు బౌండరీ బాది దూకుడు కనబర్చాడు. కానీ విలియమ్ ఓ రూర్కీ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ మరుసటి బంతికే లియామ్ లివింగ్ స్టోన్ ఎల్బీగా గోల్డెన్ డకౌటవ్వడంతో ఆర్సీబీపై ఒత్తిడి పెరిగింది.
విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ..
క్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. మయాంక్ అగర్వాల్ వరుస బౌండరీలు బాదడంతో ఆర్సీబీ స్కోర్ బోర్డు పరుగెత్తింది. 9.1 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసుకుంది. 27 బంతుల్లో కోహ్లీ హాఫ్ సెంచరీ కూడా పూర్తయింది. నిలకడగా ఆడుతున్న ఈ జోడీని ఆవేశ్ ఖాన్ విడదీసాడు. సెట్ అయిన కోహ్లీని క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో నాలుగో వికెట్కు నమోదైన 43 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
జితేష్, మయాంక్ మెరుపులు..
క్రీజులోకి వచ్చిన జితేష్ శర్మ తొలి బంతినే బౌండరీకి తరలించి తన ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఓరూర్కీ బౌలింగ్లో సిక్స్ బాదిన జితేష్.. షెహ్బాజ్ బౌలింగ్లో రెండు ఫోర్లు, సిక్స్ సాయంతో 21 పరుగులు పిండుకున్నాడు. అనంతరం మరింత దూకుడుగా ఆడిన జితేష్ శర్మ.. దిగ్వేష్ రతి వేసిన 17వ ఒవర్లో రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అతను వేసిన తొలి బంతికి క్యాచ్ ఔటవ్వగా.. అది నోబాల్ అయ్యింది. ఆఖరి బంతి వేసే ముందు జితేష్ క్రీజు ధాటడంతో వినూ మన్కడ్ తరహాలో జితేష్ రనౌట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బౌలింగ్ యాక్షన్ పూర్తవ్వలేదని థర్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.
ఈ అవకాశాలతో చెలరేగిన జితేశ్ శర్మ.. విలియమ్ ఓ రూర్కీ వేసిన 18వ ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్లు బాది 21 పరుగులు పిండుకున్నాడు. ఆయుష్ బదోని బౌలింగ్లో జితేష్ సిక్సర్ బాది విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.