ఐపీఎల్ 2024 సీజన్లో ప్లే ఆఫ్స్ చేరే జట్లను అధికారిక బ్రాడ్కాస్టర్ జియోసినిమా అంచనా వేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్కు జియోసినిమా బిగ్ షాక్ ఇచ్చింది. రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ప్లే ఆఫ్స్ చేరుతాయని జోస్యం చెప్పింది.
పంజాబ్ కింగ్స్ అట్టడుగు స్థానంలో నిలుస్తుందని, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ 7, 8, 9 స్థానాలతో సరిపెట్టుకుంటాయని పేర్కొంది.

ప్రస్తుతం కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ టాప్-4లో కొనసాగుతున్నాయి. టాప్-2లో నిలిచిన రెండు జట్లు చెరో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉండగా.. సన్రైజర్స్ హైదరాబాద్, సీఎస్కే మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆర్సీబీ 5 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతోంది.
ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్లను ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్కేలతో ఆడనుంది. అయితే ఈ రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి ఆర్సీబీ టాప్-4లోకి వస్తుందని జియోసినిమా అంచనా వేసింది. ఇక రాజస్థాన్ రాయల్స్ తమ తదుపరి మ్యాచ్ల్లో సీఎస్కే, పంజాబ్ కింగ్స్, కేకేఆర్లను ఓడించి టేబుల్ టాపర్గా నిలుస్తుందని జోస్యం చెప్పింది.
ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్పై కేకేఆర్ గెలుస్తుందని, రాజస్థాన్ రాయల్స్ చేతిలో మాత్రం ఓడుతుందని తెలిపింది. సన్రైజర్స్ హైదరాబాద్ తమ చివరి రెండు మ్యాచ్ల్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి.. పంజాబ్ కింగ్స్పై విజయం సాధిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం ఈ ప్రిడిక్షన్ నెట్టింట వైరల్గా మారింది.
ఇప్పటికే 59 మ్యాచ్లు పూర్తయినా ఒక్క జట్టు కూడా ప్లే ఆఫ్స్ బెర్త్ను దక్కించుకోలేదు. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మాత్రం ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించాయి. 4 స్థానాల కోసం 8 జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ టీమ్స్ ప్లే ఆఫ్స్ బెర్త్లను దాదాపు ఖరారు చేసుకున్నాయి. మిగతా రెండు బెర్త్ల కోసం 6 జట్లు పోటీపడుతున్నాయి. ఆర్సీబీ తొలి 8 మ్యాచ్ల్లో ఒకే ఒక విజయం సాధించగా.. తర్వాతి 4 మ్యాచ్ల్లో వరుసగా విజయం సాధించింది.