భారత మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ సోషల్ మీడియా వేదికగా మరోసారి తీవ్ర ట్రోలింగ్కు గురైంది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025 గెలిచిన భారత జట్టులో కీలక సభ్యురాలిగా ఉన్న జెమీమా.. బుధవారం జట్టుతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆటగాళ్లతో సరదాగా ముచ్చటించారు. ప్రతీ ప్లేయర్తో మాట్లాడాడు.
అయితే ప్రధాని ముందు జెమీమా కాలుపై కాలు వేసుకోని కూర్చోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. టీమిండియా ప్లేయర్ హర్లీన్ డియోల్.. ప్రధాని మోదీ చర్మ రహస్యం గురించి ప్రశ్నించిన సమయంలో జెమీమా కాలుపై కాలు వేసుకొని కనిపించింది. హర్లీన్ ఫన్నీ క్వశ్చన్ అడగడం.. మోదీ వాటిని పట్టించుకోనని చెప్పడంతో ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. అయితే కొందరు ఈ వీడియోలో జెమీమా ప్రధాని ముందు కాలుపై కాలు వేసుకోవడాన్ని తప్పుబడుతూ ఆమెపై ట్రోలింగ్కు దిగారు.

జెమీమాకు అంత తలపొగరా? ప్రధాని ముందే కాలుపై కాలు వేసుకుంటుందా? అని మండిపడ్డారు. జెమీమాకు సంస్కారం లేదని ఓ వర్గం మొత్తం సోషల్ మీడియా వేదికగా ఆమెపై విరుచుకుపడింది. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో జెమీమాతో పాటు హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధానలు కూడా అప్పుడప్పుడు తమ కాలుపై కాలు వేసుకొని కనిపించారు. ఈ ఫొటోలు కూడా నెట్టింట వైరల్గా మారాయి. కానీ కొందరు ఉద్దేశపూర్వకంగా జెమీమాను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
ప్రధాని మోదీకి లేని బాధ మీకెందుకు? అని మరికొందరు ఆ పోస్ట్లకు కౌంటర్ ఇస్తున్నారు. జెమీమాతో పాటు ఇతర ఆటగాళ్లు కూడా కాలుపై కాలు వేసుకున్నారని, వాటికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ 'ఈ కాలు నాదే.. ఆ కాలు నాదే.. నా కాలు మీద నా కాలు వేసుకుంటే తప్పేముంది?'అని అల్లు అర్జున్ డైలాగ్ కొడితే థియేటర్లో ఈలలు వేసి, చప్పట్లు కొట్టిన జనాలు.. ఇవ్వాళ జెమీమా కాలుపై కాలు వేసుకోవడాన్ని విమర్శించడం ఏంటని? ప్రశ్నిస్తున్నారు. అమ్మాయిలు తమ సౌకర్యవంతం కోసం కాలుపై కాలు వేసుకోవడం సహజమేనని, చాలా కార్యక్రమాల్లో పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఇలా కాలుపై కాలు వేసుకుంటారని కామెంట్ చేస్తున్నారు.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో జెమీమ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ మ్యాచ్ అనంతరం జీసస్ కారణంగానే గెలిచామని చెప్పింది. ఈ మ్యాచ్లో జెమీమా ఇచ్చిన మూడు క్యాచ్లను ఆసీస్ ప్లేయర్లు వదిలేసారు. దాంతోనే ఆమె ఆ దేవుడి దయతోనే గెలిచామని తెలిపింది. కానీ ఈ వ్యాఖ్యలను జీర్ణించుకోలేని కొందరు.. ఆమెపై జుగుప్సాకరమైన రీతిలో ట్రోలింగ్కు దిగారు. ఫైనల్లో జెమీమా విఫలమవడంతో ఎగతాళి చేశారు. ఈ రోజు జీసస్ గెలిపించలేదా? అని ప్రశ్నించారు. తాజాగా మోదీ ముందు కాలుపై కాలు వేసుకోని కనిపించడంతో మరోసారి ట్రోలింగ్కు దిగారు.