జీసస్ వల్లే విజయం సాధ్యమైందని, ఆయనే తనను నడిపించాడని చెబుతూ టీమిండియా మహిళా బ్యాటర్, మ్యాచ్ విన్నర్ జెమీమా రోడ్రిగ్స్ కన్నీటి పర్యంతమైంది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్లో జెమీమా రోడ్రిగ్స్(134 బంతుల్లో 14 ఫోర్లతో 127 నాటౌట్) అజేయ శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆఖరి వరకు క్రీజులో నిలబడి విజయలాంఛనాన్ని పూర్తి చేసింది. జెమీమా అసాధారణ ప్రదర్శనతో టీమిండియా 339 పరుగుల రికార్డ్ లక్ష్యాన్ని ఛేదించి సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఈ అద్భుత శతకంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన జెమీమా.. హోస్ట్తో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైంది. ఏడుస్తూనే తన ఇన్నింగ్స్ గురించి చెప్పుకొచ్చింది. 'ముందుగా నేను జీసస్కు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వల్లే నేను ఈ ఇన్నింగ్స్ ఆడాను. ఈ రోజు జీసస్ నన్ను నడిపించాడు. నాకు అండగా నిలిచిన మా అమ్మ, నాన్న, కోచ్తో పాటు ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. గత నెల నాకు చాలా కష్టంగా గడిచింది. కానీ ఈ ఇన్నింగ్స్ నాకు ఒక కలలా అనిపిస్తుంది. ఈ విజయం ఇంకా నా మదిలోకి ఎక్కలేదు.

నేను స్నానం చేయడానికి వెళ్తుండగా మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలని చెప్పారు. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలని అనుకున్నాను. నా కోసం కాకుండా జట్టు కోసమే ఆడాను. గతంలో మేం కీలకమైన మ్యాచ్లు ఓడిపోయాం. ఈ సారి ఆ తప్పిదం చేయకూడదని గట్టిగా అనుకున్నాను. హాఫ్ సెంచరీ, సెంచరీ ఏదీ నేను పట్టించుకోలేదు. జట్టు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. అందుకే సెంచరీని సెలెబ్రేట్ చేసుకోలేదు.
గతేడాది ప్రపంచకప్ జట్టులో నాకు చోటు దక్కలేదు. అప్పుడు ఫామ్లో ఉన్నా నాకు అవకాశం దక్కలేదు. ఆ సమయంలో నేను తీవ్ర మానసిక వేధనను అనుభవించాను. ప్రతీ రోజు ఏడుస్తూ కూర్చున్నాను. మరింత ఎక్కువగా కష్టపడి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాను. నేటి ఇన్నింగ్స్లో ఆ దేవుడు నాకు అండగా నిలిచాడు. బ్యాటింగ్ చేసే సమయంలో నాతో నేను ఎక్కువగా మాట్లాడుకున్నాను. బైబిల్లో ఒక వ్యాక్యాన్ని పదే పదే ఉటంకించాను.
'నిశ్చలంగా ఉండు.. ఆ దేవుడు నీ కోసం పోరాడుతాడు.'అనే బైబిల్ వ్యాఖ్యాన్ని పదే పదే మనసులో అనుకున్నాను. అందులో ఉన్నట్లుగానే ఆ దేవుడు నా కోసం పోరాడాడు. ఈ విజయం ఇచ్చిన ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేను. హర్మన్ ప్రీత్ కౌర్ వచ్చినప్పుడు మంచి భాగస్వామ్యం నమోదు చేయాలని భావించాం.చివర్లో నేను దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాను. కానీ అది నా వల్ల కాలేదు.
దీప్తి శర్మ ప్రతీ బంతికి నాతో మాట్లాడి నన్ను కూల్ చేసింది. నా సహచర ఆటగాళ్లు నాకు అండగా నిలిచారు. ఈ గెలుపు క్రెడిట్ నా ఒక్కదానిదే కాదు. సమష్టిగానే ఈ విజయం దక్కింది. ప్రేక్షకుల మద్దతు, వారి అరుపులు నన్ను మరింత ఉత్సాహపరిచాయి.'అని జెమీమా చెప్పుకొచ్చింది. జెమీమా చెప్పినట్లుగా ఆమెకు దేవుడు అండగా నిలిచాడు. ఆమె ఇచ్చిన మూడు సునాయస క్యాచ్లను ఆసీస్ ఆటగాళ్లు వదిలేసారు.
Jemimah in tears during Post Match Presentation and thanking all the Crowd for love and Support.❤️#WomensWorldCup2025
— DIVYANSH CHAUHAN (@Imchauhan28) October 31, 2025
pic.twitter.com/3I7TC4rPFn