శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. వైజాగ్ వేదికగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో సమష్టిగా రాణించిన భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళల టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 121 పరుగులు చేసింది.
విష్మి గుణరత్నే(43 బంతుల్లో ఫోర్, సిక్స్తో 39), హాసిని పెరెరా(23 బంతుల్లో 2 ఫోర్లతో 20), హర్షితా సమరవిక్రమా(23 బంతుల్లో 2 ఫోర్లతో 21) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, దీప్తి శర్మ, శ్రీ చరణి తలో వికెట్ తీసారు.

అనంతరం భారత మహిళలు 14.4 ఓవర్లలో 2 వికెట్లకు 122 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(44 బంతుల్లో 10 ఫోర్లతో 69 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. స్మృతి మంధాన(25 బంతుల్లో 4 ఫోర్లతో 25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో ఇనోక రణవీర, కావ్య కవిండి తలో వికెట్ తీసారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో సమష్టిగా రాణించడంతో ఈ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా ముగిసింది. ముందుగా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక స్వల్ప స్కోర్కే పరిమితమైంది.
అనంతరం భారత్ స్వేచ్చగా బ్యాటింగ్ చేసింది. పెళ్లి రద్దయిన అనంతరం స్మృతి మంధాన ఆడిన తొలి మ్యాచ్ ఇదే. తన శైలికి భిన్నంగా ఆడిన మంధాన భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయింది. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ(9) తీవ్రంగా నిరాశపర్చగా.. జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. వరల్డ్కప్ ఫామ్ను కొనసాగిస్తూ దూకుడుగా ఆడిన జెమీమా 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 వైజాగ్ వేదికగా డిసెంబర్ 23న జరగనుంది.