Jemimah Rodrigues: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 ఫైనల్లో ఓడినా తమ జట్టు ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ తెలిపింది. జట్టు విజయం కోసం ప్రతీ ఒక్కరు తమ సర్వసాన్ని ధారపోశారని చెప్పింది. దురదృష్టవశాత్తు ఆశించిన ఫలితం దక్కలేదని పేర్కొంది. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోవడమే తమ ఓటమికి ప్రధాన కారణమని తెలిపింది.
గురువారం వడోదర వేదికగా జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి రెండో టైటిల్ను ముద్దాడింది. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగో ఫైనల్లోనూ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన జెమీమా రోడ్రిగ్స్..తమ ఆటగాళ్లకు మద్దతుగా నిలిచింది. ఫైనల్లో 204 పరుగులు అనేది గొప్ప స్కోర్ అని, కాపాడుకోలేకపోయామని పేర్కొంది.

'జట్టు ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులందరికీ ధన్యవాదాలు. ఫైనల్ మ్యాచ్లో 204 పరుగులు అనేది ఎప్పుడూ గొప్ప స్కోరే. మా జట్టు అద్భుతంగా రాణించింది. మా టీమ్ ఎప్పుడైనా విజృంభించాలి అని కోరుకుంటే అది కచ్చితంగా ఈ రోజే. ప్రతీ ఒక్కరు కష్టపడి ఆడారు. తమ సర్వస్వాన్ని ధారపోశారు. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. మా సీనియర్ ఆటగాళ్లు కూడా అద్భుతంగా పుంజుకున్నారు. నందిని అద్భుతంగా రాణించింది. మేం ఆమె నుంచి ఆశించిన దాని కంటే ఎక్కువే చేసింది. మిన్ను కూడా చాలా బాగా ఆడింది. అంతా అద్భుతంగా సాగింది.'అని జెమీమా రోడ్రిగ్స్ చెప్పుకొచ్చింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 203 పరుగులు చేసింది. కెప్టెన్ జెమీమా(37 బంతుల్లో 8 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీ సాధించగా.. లారా వోల్వర్డ్ట్(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 44), చినెల్ హెన్రీ(15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 35 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో సయాలీ సత్ఘరే(1/46), అరుంధతి రెడ్డి(1/40), నదినే డీ క్లెర్క్(1/48) తలో వికెట్ తీసారు.
అనంతరం ఆర్సీబీ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసి గెలుపొందింది. జార్జియో వాల్(54 బంతుల్లో 14 ఫోర్లతో 79), స్మృతి మంధాన(41 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లతో 87) విధ్వంసకర బ్యాటింగ్తో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో చినెల్ హెన్రీ(2/34) రెండు వికెట్లు తీయగా.. నందని శర్మ, మిన్ను చెరో వికెట్ పడగొట్టారు. తెలుగు తేజం శ్రీ చరణి(0/46) తీవ్రంగా నిరాశపర్చింది.