భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ సెక్రటరీ జై షా గుడ్ న్యూస్ చెప్పారు. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ పూర్తి ఫిట్నెస్ సాధించాడని, టీ20 ప్రపంచకప్ 2024 ఆడేందుకు అతను సిద్దంగా ఉన్నాడని తెలిపారు. అతి త్వరలోనే నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) అధికారులు అతని ఫిట్నెస్ వ్యవహారంపై అధికారిక ప్రకటన చేయనున్నారని చెప్పారు.
'రిషభ్ పంత్ సూపర్ ఫిట్నెస్ సాధించాడు. బ్యాటింగ్తో పాటు వికెట్ కీపింగ్ కూడా చేస్తున్నాడు. అతి త్వరలోనే అతని ఫిట్నెస్పై తుది నిర్ణయం తీసుకుంటాం. అతను టీ20 ప్రపంచకప్ ఆడగలిగితే.. అది టీమిండియాకు కలిసొచ్చే అంశం అవుతోంది. అతను భారత క్రికెట్కు చెందిన బిగ్ అసెట్. టీమిండియాలోకి వచ్చేందుకు అతనికి డోర్స్ ఓపెన్ అయ్యాయి.

అయితే అతను ఇటీవలే కీపింగ్ చేయడం మొదలుపెట్టాడు. దాంతోనే మేం కాస్త వేచి చూడాలనుకుంటున్నాం. మా మెడికల్ టీమ్ అతని గాయాల పురోగతిని, ఫిట్నెస్ను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే అతని ఫిట్నెస్పై గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. 'అని జై షా చెప్పుకొచ్చారు.
ఘోర రోడ్డు ప్రమాదంతో గత ఏడాదిన్నరగా ఆటకు దూరంగా ఉన్న రిషభ్ పంత్.. మైదానంలోకి అడుగుపెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ప్రస్తుతం అతను బెంగళూరులోని ఎన్సీఏలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్దమవుతున్నాడు.
ఈ సీజన్లో రిషభ్ పంత్.. మునపటిలా సత్తా చాటితే.. నేరుగా టీ20 ప్రపంచకప్కు ఎంపికవ్వనున్నాడు. కొత్త ఏడాది తన కుటుంబ సభ్యులకు సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా తన బీఎమ్డబ్ల్యూ కారులో ఢిల్లీ నుంచి రూర్కీ బయలుదేరిన రిషభ్ పంత్.. ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
కారును అతి వేగంగా నడపడంతో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారు పూర్తిగా దగ్దమైంది. ఓ బస్ డ్రైవర్, కండక్టర్ సాయం చేయడంతో రిషభ్ పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. తల, మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. 2022 డిసెంబర్ 30 అర్థరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదం కారణంగా రిషభ్ పంత్ ఐపీఎల్ 2023 సీజన్తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ 2023, వన్డే ప్రపంచకప్ 2023 వంటి ప్రధాన టోర్నీలకు దూరమయ్యాడు. పంత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, ధ్రువ్ జురెల్ కీపర్లుగా వ్యవహరించారు.