ఒక్క ఫార్మాట్కు మాత్రమే కోచ్గా వ్యవహరించాలని గౌతమ్ గంభీర్కు చెప్పలేనని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెక్రటరీ జై షా అన్నాడు. టీమిండియాకు ఒక్కో ఫార్మాట్కు ఒక్కో కోచ్ అవసరం లేదన్నాడు. ఈ వాదనే సరికాదన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024తో టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ముగియడంతో అతని వారసుడిగా గంభీర్ను ఎంపిక చేశారు.
ఈ తరుణంలో ఒక్కో ఫార్మాట్కు ఒక్కో కోచ్ ఉండాలనే డిమాండ్ వ్యక్తమైంది. అయితే, బీసీసీఐ మాత్రం.. దానికి అంగీకరించలేదు. ప్రధాన కోచ్గా ఒకరిని నియమించి అతని సూచనల మేరకు సహాయ కోచ్లను నియమించేందుకు మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలోనే అన్ని ఫార్మాట్లకు కోచ్గా గౌతమ్ గంభీర్ను నియమించింది. ఆయన నియామకంపై తాజాగా ఓ కార్యక్రమంలో జై షా స్పందించారు.

'ఎంపిక చేసిన కోచ్ చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకోవాలి. పూర్తి స్థాయిలో చర్చించుకున్న తర్వాతే గంభీర్ను కోచ్గా ఎంపిక చేశాం. అన్ని ఫార్మాట్లకు కోచ్గా కొనసాగేందుకు ఆయన ఆసక్తిగా ఉన్నప్పుడు మీరు ఈ ఫార్మాట్కు మాత్రమే పరిమితవ్వండని నేనెలా చెప్పగలను. అంతేకాకుండా టీమిండియాలోని దాదాపు 78 శాతం మంది ఆటగాళ్లు వన్డే, టీ20, టెస్ట్ క్రికెట్.. మూడు ఫార్మాట్లూ ఆడుతున్నారు.'అని జై షా చెప్పుకొచ్చాడు.
టీమిండియాకు కోచ్ల కొరత లేదన్న జైషా.. నేషనల్ క్రికెట్ అకాడమీ చాలా మంది కోచ్లను అందిస్తోందని తెలిపారు. గతంలో రాహుల్ ద్రవిడ్ స్వల్ప విరామం తీసుకున్నప్పుడు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్గా సేవలు అందించిన విషయం జై షా గుర్తు చేశాడు. శ్రీలంక పర్యటనతో కోచ్గా బాధ్యతలు చేపట్టిన గంభీర్.. మిశ్రమ ఫలితాలు అందుకున్నాడు. అతని పర్యవేక్షణలో టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వన్డే సిరీస్ను 0-2తో కోల్పోయింది. బంగ్లాదేశ్తో సెప్టెంబర్లో జరిగే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ గంభీర్కు మొదటిది కానుంది.