గాయాల బారిన పడే ప్రమాదం ఉండటంతోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలను దేశవాళీ క్రికెట్కు దూరంగా ఉంచామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెక్రటరీ జై షా తెలిపాడు. సీనియర్ ప్లేయర్లుగా వారిని మేం గౌరవంగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.
సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీలో బరిలోకి దిగే నాలుగు జట్లను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. అనంతపురం, బెంగళూరు వేదికగా ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో బీసీసీఐ అగ్రశ్రేణి ఆటగాళ్లను భాగస్వామ్యం చేసింది. భవిష్యత్తు టెస్ట్ సిరీస్ల నేపథ్యంలో సెలెక్టర్లు ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.

శుభ్మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ వరుసగా ఏ, బీ, సీ, డీ జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఆడుతారని ప్రచారం జరగ్గా.. వారికి సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు లేని సమయంలో భారత సీనియర్ ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని గతంలో బీసీసీఐ ఆటగాళ్లను ఆదేశించింది.
తమ సూచనలను బేఖాతరు చేసిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను సెంట్రల్ కాంట్రాక్ట్ల నుంచి తొలగిస్తూ కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. దేశవాళీ క్రికెట్ ఆడకపోవడానికి గల కారణాన్ని జై షా వెల్లడించాడు. అప్ కమింగ్ సిరీస్లను దృష్టిలో పెట్టుకొనే కోహ్లీ, రోహిత్లతో పాటు మరికొంత మంది సీనియర్ ఆటగాళ్లకు దేశవాళీ క్రికెట్ నుంచి మినహాయింపు ఇచ్చామని తెలిపాడు.
'రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లను దులీప్ ట్రోఫీ ఆడాలని ఆదేశించలేం. వారికి గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాల్లో ఏ అంతర్జాతీయ క్రికెటర్ కూడా దేశవాళీ క్రికెట్ ఆడడు. మేం ఆటగాళ్లను గౌరవంగా చూడాలి.'అని జై షా ఓ స్పోర్ట్స్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
టెస్ట్ క్రికెట్ కోసం ప్రత్యేకమైన ఫండ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా జై షా తెలిపాడు. పింక్ బాల్ టెస్ట్ల పట్ల బీసీసీఐ సుముఖంగా లేదన్నాడు. పింక్ బాల్ టెస్ట్లు 2-3 రోజుల్లోనే ముగుస్తాయని, ఫ్యాన్స్ ఐదు రోజుల కోసం టికెట్లు కొంటారని తెలిపాడు. పింక్ బాల్స్ కారణంగా ప్రేక్షకులు, బ్రాడ్కాస్టర్స్ తీవ్రంగా నష్టపోతారని చెప్పాడు.
ఒలింపిక్స్ క్రీడాకారుల కోసం కొత్త ఎన్సీఏను సిద్దం చేశామని కూడా జై షా వెల్లడించాడు. కొత్త ఎన్సీఏలో 3 మైదానాలు, 100 పిచ్లు, 45 ఇండోర్ టర్ఫ్స్ నిర్మించామని తెలిపాడు. ఇందులో నాన్ క్రికెటర్స్, ఒలింపిక్ అథ్లెట్లు కూడా శిక్షణ తీసుకోవచ్చన్నారు.