టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపై ఐసీసీ ఛైర్మెన్ జై షా ప్రశంసల జల్లు కురిపించారు. ఇప్పటికీ రోహిత్ శర్మను కెప్టెన్ అనే పిలుస్తానని తెలిపారు. ఎందుకంటే రోహిత్ శర్మ సారథ్యంలోనే భారత్ రెండు ఐసీసీ టైటిళ్లు గెలిచిందని చెప్పారు. జై షా మాటలకు రోహిత్ చిరునవ్వుతో బదులిచ్చాడు.
రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన సంగతి తెలిసిందే. 11 ఏళ్ల భారత ఐసీసీ టైటిల్ నిరీక్షణకు రోహిత్ తెరదించాడు. టీ20 ప్రపంచకప్ అనంతరం పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్.. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకోసం ఫిట్నెస్పై ఫోకస్ పెట్టిన రోహిత్.. ఏకంగా 10 కిలోల బరువు తగ్గాడు. కానీ వన్డే సారథ్య బాధ్యతలను కూడా రోహిత్ కోల్పోయాడు.

టీమ్ భవిష్యత్తు నేపథ్యంలో శుభ్మన్ గిల్కు వన్డే, టెస్ట్ సారథ్య బాధ్యతలు దక్కగా.. సూర్యకుమార్ యాదవ్ టీ20 కెప్టెన్గా కొనసాగుతున్నాడు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో రోహిత్ శర్మపై జై షా ప్రశంసల జల్లు కురిపించాడు. 'మా కెప్టెన్ ఇక్కడే ఉన్నాడు. ఇప్పటికీ అతన్ని నేను కెప్టెన్ అనే పిలుస్తా. ఎందుకంటే అతని సారథ్యంలోనే భారత జట్టు రెండు ఐసీసీ టైటిళ్లు గెలిచింది.
వన్డే ప్రపంచకప్ 2023 తృటిలో చేజారినా.. వరుసగా 10 మ్యాచ్ల్లో విజేతగా నిలిచింది. ఈ టోర్నీ గెలవకపోయినా అభిమానుల హృదయాలను గెలుచుకున్నాం. ఆ మరుసటి ఏడాది ఫిబ్రవరి(2024)లో.. రాజ్కోట్ వేదికగా తదుపరి ప్రపంచకప్తో పాటు అభిమానుల మనసులను కూడా గెలుస్తామని నేను చెప్పాను.'అని జై షా గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
2021 డిసెంబర్లో పూర్తి స్థాయి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ 56 మ్యాచ్ల్లో భారత జట్టును నడిపించాడు. ఇందులో భారత్ 42 గెలిచి 12 మ్యాచ్ల్లో ఓడింది. ఇందులో ఒక మ్యాచ్ టై కాగా.. మరో మ్యాచ్ ఫలితం తేలలేదు. ఆసియా కప్ 2018లో తాత్కలిక సారథిగా భారత్ను విజేతగా నిలబెట్టాడు. ఆసియా కప్ 2023లో ఫుట్టైమ్ కెప్టెన్గా టైటిల్ అందుకున్నాడు.
వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ జట్టును ఫైనల్ చేర్చాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అందించాడు. టీ20ల్లో 62 మ్యాచ్ల్లో 49 విజయాలు అందించాడు. కెప్టెన్ రోహిత్ విన్నింగ్ పర్సంటేజ్ 79.03గా ఉంది. ప్రపంచంలో అత్యుత్తమ విన్నింగ్ యావరేజ్ కలిగిన కెప్టెన్గా రోహిత్ గుర్తింపు పొందాడు. ప్రస్తుతం రోహిత్ న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్ కోసం సిద్దమవుతున్నాడు.