మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది. అద్వితీయమైన ప్రదర్శనతో అర్దశతాబ్దపు కలను సాకారం చేసుకుంది. 2005, 2017 ఫైనల్లో తృటిలో టైటిల్ చేజారగా.. ఈసారి మాత్రం భారత మహిళల జట్టు ఏ తప్పు చేయలేదు. ఒత్తిడిని చిరునవ్వుతో ఛేదిస్తూ తొలిసారి ఫైనల్ చేరిన సౌతాఫ్రికాను మట్టికరిపించింది. 1983 ప్రపంచకప్లో కపిల్ సేన సాధించిన విజయం భారత క్రికెట్ గతిని మార్చినట్టే.. హర్మన్ సేన సాధించిన తాజా విజయం మహిళల క్రికెట్ను మరో మెట్టిక్కించనుంది.
ఫైనల్లో షెఫాలీ వర్మ, దీప్తి శర్మ ఆల్రౌండ్ షోతో పాటు అమన్జోత్ కౌర్ మ్యాచ్ విన్నింగ్ క్యాచ్ టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించాయి. తెలుగు తేజం శ్రీచరణి టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చగా.. ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీకా రావల్తో బ్యాట్తో సత్తా చాటారు.

ఈ విజయం నేపథ్యంలో భారత మహిళా క్రికెటర్లపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా భారత మహిళల విజయంపై స్పందించిన ఐసీసీ ఛైర్మన్ జై షా.. సమష్టి ప్రదర్శనతోనే ఈ చిరస్మరణీయ విజయం దక్కిందని చెప్పాడు. 'నాకు మహిళల క్రికెట్ అంటే చాలా ఇష్టం. భారత మహిళల జట్టు ఐసీసీ ట్రోఫీని నెగ్గడం సంతోషంగా ఉంది. ఇలాంటి విజయం, మహిళల క్రికెట్ అభివృద్ధి కావడం వంటి పరిణామాలన్నీ మన కళ్ల ముందే కార్యరూపం దాల్చాయి. అందుకోసం ప్రత్యక్షంగా, తెర వెనుక పనిచేస్తోన్న కష్టానికి ఇదే నిదర్శనం.'అని జైషా పేర్కొన్నాడు.