
కోల్కతా: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్తో సందిగ్ధంలో పడిన టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సఫారీ గడ్డపై భారత్ కేవలం 3 టెస్ట్లు, 3 వన్డేల సిరీస్లు మాత్రమే ఆడనుంది. 4 మ్యాచ్ల టీ20 సిరీస్ను వాయిదా వేసారు. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జైషా ఓ ప్రకటనను విడుదల చేశాడు. ఇక సౌతాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో టీమిండియా ఈ పర్యటనను రద్దు చేసుకోవడమే ఉత్తమమనే అభిప్రాయం వ్యక్తమైంది.
కానీ సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఏర్పాటు చేసే బయో బబుల్లో ప్లేయర్లు సేఫ్గా, సెక్యూర్గా ఉంటారని భావించిన బోర్డు.. కోల్కతా వేదికగా నేడు(శనివారం) జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని జైషా వెల్లడించాడు.
'మూడు టెస్టులు, మూడు వన్డేలు సిరీస్ కోసం భారత జట్టు సౌతాఫ్రికాకు వెళ్తుంది. ముందుగా అనుకున్న 4 టీ20 మ్యాచ్ల సిరీస్ మాత్రం తర్వాత జరుగుతుంది.'' అని జై షా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో మరో 48 గంటల తర్వాత టీమిండియా- ప్రొటిస్ జట్ల సిరీస్లకు వేదికను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం జొహన్నస్బర్గ్, ప్రిటోరియాలో మ్యాచ్లు నిర్వహించాల్సి ఉంది. కానీ, ఈ రెండు పట్టణాలు ఒమిక్రాన్ ప్రధాన కేంద్రమైన గౌటెంగ్ ప్రావిన్స్లో ఉన్న నేపథ్యంలో ఈ మేరకు వేదికలు మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే డిసెంబర్ 8 లేదా 9న భారత జట్టు సౌతాఫ్రికా పర్యటనకు బయల్దేరనుంది. ఒకవేళ ఈ తేదీల్లో భారత జట్టు బయల్దేరకుంటే మాత్రం సిరీస్ల రీ షెడ్యూల్ను త్వరలో ప్రకటించనున్నారు. ఇక సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే టీమ్ను కూడా ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పటికే భారత్-ఏ జట్టు అక్కడ పర్యటిస్తుండగా.. అక్కడ రాణిస్తున్న ఆటగాళ్లకు ప్రాధాన్యత లభించనుంది. అంతేకాకుండా న్యూజిలాండ్ సిరీస్కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్లు ఈ పర్యటనకు అందుబాటులోకి రానున్నారు.